KCR : కాంగ్రెస్ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. ఇవాళ సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్ హితవు పలికారు.
‘ప్రజాస్వామ్యంలో ప్రజలుంటరు. ప్రజలకు బాధలుంటయ్. ప్రజాస్వామ్యంలో అతిగా పోవద్దని పోలీస్ మిత్రులకు చెబుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేం గూడా పదేళ్లు అధికారంలో ఉన్నం. పదేళ్లలో మేం ఇదే దురుసు ప్రవర్తనకు పోతే కాంగ్రెస్ నశ్యానికి కూడా మిగలకుండె. పదేళ్లు మేం ప్రజల సంక్షేమానికి పనికొచ్చే పనులు చేసినం. ఉన్నోన్ని లేనోన్ని కడుపుల పెట్టుకుని కంటికిరెప్పలా చూసుకున్నం. అదే ప్రజలను ఇప్పుడు మీరు మోసం చేస్తమంటే ఊరుకోం. రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది..? ఎందుకు స్పందిస్తలేరు. ఎప్పటికల్లా చేస్తరో ఎందుకు చెప్తలేరు..? బ్యాంకులు రైతులకు నోటీలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపరు..? దానికి సమాధానం కావాలి. మేం ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన అడుగుతున్నం’ అన్నారు.
‘ప్రభుత్వం వరి పంటకు రూ.500 బోనస్ ఇయ్యాలె. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలంటూ ఏప్రిల్ 2న బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమొరాండం సమర్పించండి. అదే రోజున శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులం హైదరాబాద్లో ప్రభుత్వానికి మెమొరాండం ఇస్తం. ఏప్రిల్ 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వరి పంటకు బోనస్ కోసం దీక్షలు చేయండి. బోనస్ ఇచ్చే దాకా కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైతులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎప్పుడూ ఈ అసమర్థ పాలనే ఉండదు. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడుతం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. వాళ్లు ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చే దాకా వెంటపడి తరుముదాం. దయచేసి ఆత్మస్తైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని కేసీఆర్ అన్నారు.