KTR | కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లే అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ బీజేపీ మంచి అవగాహనతో కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానీని తిట్టి…. అధికారంలోకి రాగానే దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బీజేపీ పనిచేసిందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదించిన నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు రాజకీయ నేపథ్యం ఉందని తరస్కరించారని.. కానీ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్ను మాత్రం నామినేట్ చేశారని తెలిపారు.
ఇండియా కూటమిలో చివరకు మిగిలేది రాహుల్ ఒక్కరే
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రా అని తిరుగుతుంటే… కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ ఛోడో అని వదిలి వెళుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ను వదిలి వెళుతున్నాయని విమర్శించారు. INDIA కూటమిలో చివరికు మిగిలేది రాహుల్ గాంధీ ఒక్కరేనని అన్నారు. ఢిల్లీలో మోదీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదని ఆయన అన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసిందని విమర్శించారు.
పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతు వినిపించగలిగేదీ బీఆర్ఎస్సే
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్లో నితీశ్ కుమార్, పంజాబ్లో ఆమ్ ఆర్మీ పార్టీ మాదిరే తెలంగాణలో కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు. మోదీని అపేది ముమ్మాటికీ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల లీడర్లే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వంటి బీజేపీ లీడర్లను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపించగలిగేది గులాబీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ వంటి పార్టీలకు ఓట్లు వేయాలని కోరారు.
ఈ నెల కరెంటు బిల్లు సోనియాగాంధీ కట్టిందా
మోసం కాంగ్రెస్ నైజమని.. హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తుందని కేటీఆర్ విమర్శించారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న ఒడ్డుకెక్కినంక బోడ మల్లన్న ఇదే కాంగ్రెస్ పార్టీ నైజమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర మంది అర్హులైన మహిళలకు రెండున్నర వేల రూపాయల మహాలక్ష్మిని పార్లమెంటు ఎన్నికలకు ముందే అందించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వివరాలు తీసుకొని సంక్షేమ పథకాలు అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ప్రచారం కోసం ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళానికి గురి చేశారని అన్నారు. పరిపాలనపరమైన కారణాలు చెప్పి హామీలను ఎత్తగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. వచ్చేనెల బిల్లు కట్టవద్దు సోనియా కడుతుందని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పిండు అని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఈ నెల కరెంటు బిల్లు సోనియాగాంధీ కట్టిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
మోదీ ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి
కిషన్ రెడ్డికి మరోసారి ఒటు అడిగే హక్కు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి.. సానుభూతితో గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచిండని అన్నారు. ఈ ఐదేండ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏదైనా ఒక్క ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తీసుకొచ్చిండా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో అతిపెద్ద గుడి కట్టింది పీజేఆర్ కుటుంబం… ఆయన కుమారుడు మన పార్టీలో ఉన్న ఏ రోజు దాన్ని ప్రచారానికి వాడుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. రామ మందిరం కట్టడం మంచిదే కానీ రాజకీయంగా, పరిపాలనాపరంగా బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. మోదీ ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అని విమర్శించారు. భారతదేశంలో అత్యంత అట్టర్ ప్లాప్ కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కిషన్ రెడ్డి మాత్రమే అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్లోమల్ల ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు.