న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద పెద్ద భవంతులలో, పై అంతస్థుల్లో ఉన్నపుడు, దివ్యాంగులు అధికారుల వద్దకు చేరుకోవడం సమస్య అయితే, వారి వద్దకే అధికారులు వెళ్లి సేవలు అందించాలని దివ్యాంగుల ప్రధాన కమిషనర్ కోర్టు ఆదేశించింది. విరళి మోదీ అనే యువతి తనకు పెళ్లి జరిగిన రోజున వివాహ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. రెండో అంతస్థులో ఉన్న రిజిస్ట్రార్ను కలవడం కోసం ఆమెను కొందరు వ్యక్తులు ఎత్తుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
దీనిపై ప్రధాన కమిషనర్ రాజేశ్ అగర్వాల్ స్పందించారు. దివ్యాంగులు పై అంతస్థులకు చేరుకోవడానికి తగిన సదుపాయాలు లేని ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్కు లేదా దివ్యాంగులకు అనుకూలంగా ఉండే చోటుకు వెళ్లి, వారికి అవసరమైన పనులు చేయాలని ఆదేశించారు. పనులు చేయడానికి అవసరమయ్యే సిబ్బంది, పరికరాలను కూడా వెంట తీసుకెళ్లాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల కార్యాలయాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. పాస్పోర్టు, వీసా సర్వీసులు, జన్ సువిధ కేంద్రాలు వంటివాటికి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టంచేయారు.