హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మార్కులేసేందుకు ఎగ్జామినర్లు డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తేలినా..వసూళ్లకు పాల్పడినా సస్పెండ్ చేస్తామని ఇంటర్బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) జయప్రదబాయి హెచ్చరించారు. నిరుడు ఇద్దరు లెక్చరర్లను సస్పెండ్ చేశామని, ఈ ఏడాది కూడా ఇదే తరహాలో కఠిన చర్యలుంటాయని తెలిపారు. గురువారం నుం చి ప్రాక్టికల్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో బుధవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షల్లో మార్కులేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా నియమితులైన వారిని రిలీవ్ చేయని కాలేజీకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. డిజిటల్ ప్రశ్నపత్రాలను ఎగ్జామినర్లకు పంపిసామని, ఓటీపీ ద్వారా ఆయా పేపర్ను ఓపెన్ చేయాలని సూచించారు.
ఇంటర్ ప్రాక్ట్రికల్స్ సమయంలోనే జేఈఈ మెయిన్, ఎన్సీసీ ఏ, బీ సర్టిఫికెట్ పరీక్షలు జరుగనున్నాయి. గురువారం జేఈఈ మెయిన్ -1 ఎగ్జామ్ జరుగనుండగా, 4న ఎన్సీసీ -ఏ సర్టిఫికెట్, 11న ఎన్సీసీ – బీ సర్టిఫికెట్ పరీక్షలున్నాయి. ఇంటర్ విద్యార్థుల్లో కొందరు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 15లోపు ఎప్పుడైనా ప్రాక్టికల్స్కు హాజరుకావొచ్చని తెలిపారు. ఇందుకు ఇంటర్ బోర్డు, డీఐఈవో కార్యాలయం అనుమతి పొందాలని జయప్రదబాయి చెప్పారు.