Dharani Portal | రైతుల సమగ్ర సమాచారం ఇచ్చినందుకు ధరణిని తీసేయాలా?
కమతాల విస్తీర్ణం ఇంత అని తెలిపినందుకు ధరణిని తీసేయాలా?
పథకాల అమలుకు మార్గం చూపినందుకు ధరణిని తీసేయాలా?
దండగన్న సాగును పండుగ చేసినందుకు ధరణిని తీసేయాలా?
గట్టు పంచాయితీలు, కొట్లాటలు ఆపినందుకు ధరణిని తీసేయాలా?
అరాచక ‘అనుభవదారు’ కాలాన్ని తొలగించినందుకు ధరణిని తీసేయాలా?
లంచాలు లేని రిజిస్ట్రేషన్లు చేస్తున్నందుకు ధరణిని తీసేయాలా?
ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే బాధలు తప్పించినందుకు ధరణిని తీసేయాలా?
ఎందుకు? రైతులు బాగుపడొద్దా?
వాళ్ల జీవితాలు బాగుండొద్దా?
ప్రజలే ఆలోచించాలి..!
కుట్రల్ని బద్ధలుకొట్టాలి..!!
నాడు..: పంటలు పండక.. అప్పులు తీర్చలేక.. అష్టకష్టాల్లో ఉన్న రైతులను భూ సమస్యలు నిండా ముంచేవి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూసేవి. అడిగితే రైతుల డాటా సమగ్రంగా లేదని సమాధానం వచ్చేది. పెండింగ్ మ్యుటేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ల వల్ల ఎవరు నిజమైన రైతులో తెలియని పరిస్థితి. ఫలితంగా రైతులకు రాయితీలు, నేరుగా ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదు. రైతులకు రుణాలు ఇవ్వాలన్నా.. బ్యాంకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవి. ఈ పద్ధతే మళ్లీ రావాలా?
నేడు..: రైతుల రికార్డులన్నీ డిజిటలైజ్ అయ్యాయి. ఒక్కసారి ధరణిలో నమోదైతే భూమి హక్కులకు ఢోకా లేదు. ప్రభుత్వం దగ్గర 65 లక్షల మంది రైతుల డాటా సిద్ధంగా ఉన్నది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, ఇతర ప్రయోజనాలు నేరుగా రైతు ఖాతాల్లోనే పడుతున్నాయి. దళారుల దందాలు బంద్, అధికారులు, నేతల బెదిరింపులకు చరమగీతం. ఇలాంటి ధరణిని తీసేస్తారా?
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకప్పుడు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక డాటా, రెవెన్యూ అధికారుల దగ్గరున్న పహాణీలు, 1బీ రికార్డుల్లో మరో డాటా ఉండేది. లక్షల మ్యుటేషన్లు పెండింగ్లో ఉండటం, లక్షల కొద్దీ డబుల్ రిజిస్ట్రేషన్లు కావడంతో ఎవరు నిజమైన హక్కుదారో ప్రభుత్వం దగ్గర కనీస సమాచారం ఉండేది కాదు. దీంతో ఏ రికార్డుల మీద ఆధారపడాలో అర్థం కాని పరిస్థితి. అసలు రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉన్నారు? కమతాల విస్తీర్ణం వారీగా ఎంత మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు? వారిలో సామాజికవర్గాల వారీగా ఎంత మంది? అన్న డాటా లేనేలేదు. అన్నీ ‘దాదాపు’గా చెప్పే అంచనాలే. దీంతో ప్రభుత్వాలు రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేశాయి. రైతులకు ఎలాంటి సహాయం అందించలేకపోయాయి. కానీ ధరణి పోర్టల్తో రైతుల సమగ్ర వివరాలు ప్రభుత్వం చేతికి వచ్చాయి. డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడింది. నిజమైన దాదాపు 65 లక్షల మంది రైతుల సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ సమాచారం ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టగలిగింది. దండగన్న వ్యవసాయాన్ని.. పండుగ చేయగలిగింది.
ఆషామాషీగా రాలేదు
ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ ఆషామాషీగా తీసుకురాలేదు. దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చూసిన అనుభవం, పేద, నిరక్ష్యరాస్యులైన రైతులు నష్టపోకుండా కాపాడాలన్న తపన, పాలకుడిగా అధికార యంత్రాంగంతో కలిసి దాదాపు మూడేం డ్ల మథనం తర్వాత ఈ పోర్టల్ ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిలబెట్టడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న అనేక చర్యల్లో ధరణి పోర్టల్ ఒకటి. ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చినా, మిషన్ భగీరథతో చెరువులు బాగుచేసి భూగర్భాన్ని నింపినా, ఉచిత విద్యుత్తు అందించినా.. నిజమైన రైతులకు ఆర్థికంగా అండగా నిలువకుంటే ప్రయోజనం శూన్యమని గ్రహించారు. ప్రభుత్వ ప్రయోజనాలు అనర్హులకు దక్కొద్దనే సంకల్పంతో ధరణికి శ్రీకారం చుట్టారు. ధరణితో రాష్ట్రంలోని 65 లక్షల మంది నిజమైన రైతుల వివరాలు ఆధార్, ఫోన్ నంబర్లతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నది. వాటి ఆధారంగానే రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టగలిగారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు ధరణి పోర్టల్ను తీసేసి బంగాళాఖాతంలో పడేస్తే.. రైతులు అగాధంలో మునిగిపోతారు.
రైతుబంధు ఆగమాగం అయితది
కాంగ్రెస్ ఉమ్మడి రాష్ర్టాన్ని దశాబ్దాలపాటు పాలించింది. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్న నేతలు కీలక మంత్రులుగా పదవులు అనుభవించారు. కానీ ఏనాడూ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. కానీ ధరణి పోర్టల్లో ఉన్న సమాచారం ఆధారంగా సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ను అమలు చేశారు. పోర్టల్ వల్ల రాష్ట్రంలోని రైతుల ఆధార్, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతా నంబర్లు, వారి విస్తీర్ణం వివరాలు ఉన్నాయి. ఒక్కో సీజన్కు ఎకరాకు రూ.5 వేల చొప్పు న ఏటా ఎకరాకు రూ.10 వేల రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా వచ్చి పడుతున్నాయి. ధరణిలో 2022-23లో రాష్ట్రం లో 65 లక్షల మంది రైతులు ఉండగా.. వారి ఆధీనంలో 1.48 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. వీరికి రెండు సీజన్లకు కలిపి రూ.14,744 కోట్లు వారి ఖాతాల్లోకి చేరా యి. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడే స్తే.. రికార్డులు ఆగమాగమై అవుతాయి. రైతుబంధు కూడా ఆగమాగమై.. అనర్హులకు డ బ్బు చేరుతుంది. అంతిమంగా ఆగిపోతుంది.
రైతుబంధు అందుకుంటున్నవారిలో 90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. 2022 యాసంగి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 63 లక్షల మందికి రైతుబంధు అందింది. ఇందులో ఐదు ఎకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులు 57,60,280 మంది ఉన్నారు. అంటే.. 91.43 శాతం మంది. ధరణి పోర్టల్ ఎత్తివేసినా, రైతుబంధు ఆగిపోయినా వందకు 91 మంది రైతుల బతుకులు చీకట్లో మగ్గిపోతాయి.
వ్యవసాయం ఆగమాగం
ఒకప్పుడు రాష్ట్రంలో ఎరువుల పంపిణీ ఎంత అధ్వానంగా ఉండేది. అర్ధరాత్రి నుంచే లైన్లలో నిలబడటం, చెప్పులు, పుస్తకాలు లైన్లలో ఉంచడం అందరికీ గుర్తే. రాష్ట్రంలో రైతుల వివరాలూ సక్రమంగా లేవు. ధరణి పోర్టల్తో రైతుల వివరాలు కచ్చితంగా ఉండటం, ఏఈవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో ఏ ఎరువులు ఎంత మేర కావాలో ప్రభుత్వం దగ్గర స్పష్టమైన అంచనాలు ఉంటున్నాయి. దీంతో ముందస్తుగానే స్టాక్ను పెడుతున్నది. ఫలితంగా ఎరువుల పంపిణీ ప్రశాంతంగా సాగుతున్నది. ధరణిని ఎత్తేస్తే మళ్లీ రైతులు పాస్పుస్తకాలను, చెప్పులను లైన్లో ఉంచి ఎండకు పడిగాపులు కాయాల్సి వస్తుంది.
రాష్ట్రంలో రైతుల, భూముల సమగ్ర వివరాల అధికారిక రికార్డు ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టే.. విద్యుత్తు ఎంత అవసరం అవుతుందో, దాని కోసం ఎంత ఖర్చు అవుతుందో కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నది. 24 గంటలపాటు ఉచితంగా కరెంటును ఇచ్చే వెసులుబాటు కలిగింది. ధరణిని ఎత్తేస్తే రైతుల వివరాలు మళ్లీ ఆగమైపోయి ఉచిత విద్యుత్తు నిలిచే ప్రమాదం లేదా?
ఎన్నారైలకు భరోసా
గతంలో రైతులు ఎవరైనా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లినా, విదేశాలకు వెళ్లినా.. భూములు వెంటనే అన్యాక్రాంతం అయ్యేవి. దొంగ పత్రాలు సృష్టించి వాటిని కబ్జా చేసేవారు. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ దుస్థితికి చెక్ పడింది. ఎన్నారైల కోసం ప్రత్యేకంగా పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. పాస్పోర్ట్ నంబర్ లేదా వారు స్థిరపడిన దేశంలో ఇచ్చే పౌరసత్వ గుర్తింపు సంఖ్య ఆధారంగా భూముల వివరాలను ధరణిలోకి నమోదు అవుతున్నది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల న ఉన్నా యజమాని నిబ్బరంగా ఉంటున్నారు. వారికి తెలియకుండా ఆ భూమి క్రయవిక్రయాలు జరిపే అవకాశమే లేకపోవడంతో గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు. అవసర సమయంలో భూములను అమ్మేందుకు ప్రత్యేకంగా జీపీఏ చేసే అవకాశం కూడా ఉండటంతో భరోసా వచ్చింది. ఒకవేళ ధరణి పోర్టల్ ఎత్తివేస్తే రూ.కోట్ల విలువైన భూమిని గాలికి వదిలేసి రైతుల పిల్లలు ఇతర రాష్ర్టాలకో, విదేశాలకో వెళ్లగలుగుతారా? ఒకవేళ వెళ్లినా దళారులు, కబ్జాకోరుల నుంచి భూమి ని కాపాడుకోగలరా? వారితో పోరాడి తిరిగి సాధించుకోగలరా? అనేది ఆలోచించాలి.
అనుభవదారులు యజమానులవుతారు
గతంలో రైతుల భూ హక్కులకు అతిపెద్ద శత్రువుల్లో ‘అనుభవదారు’ కాలం ఒకటి. పహాణీల్లో పట్టాదారు వివరాలకు పక్కనే 13వ కాలంలో అనుభవదారు పేరు, 14లో అనుభవదారు విస్తీర్ణం నమోదై ఉండేవి. కొన్నేండ్లకు అధికారులకు లంచాలు ఇచ్చో.. పేరు, పలుకుబడిని వాడుకొనో.. పహాణీల్లో ఇష్టారాజ్యంగా పేర్లు మార్చేవాళ్లు. అనుభవదారు కాలంలో ఉండాల్సిన పేరును యజమాని పేరుగా మార్చేవారు. ఈ విషయం కనీసం రైతుకు లేదా యజమానికి కూడా తెలిసేది కాదు. విషయం తెలిసిన తర్వాత ఆయా కుటుంబాల మధ్య ఘర్షణలకు దారితీసేవి. ఇలాంటివి హత్యలు వంటి తీవ్రమైన నేరాల వరకు వెళ్లేవి. ధరణి పోర్టల్లో అనుభవదారు అనే పదమే లేదు. ‘భూ యజమాని’ మాత్రమే ఉంటారు. వారి పేరు మీదే సర్వ హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆ పోర్టల్ తీసి పాత పద్ధతికి వెళ్తే మళ్లీ అనుభవదారులు రైతుల మెడకు ఉచ్చుగా మారుతారు. ఈ పరిణామాన్ని ఆహ్వానిద్దామా?
ధరణి సమస్య కాదు.. స్కానింగ్
ధరణి పోర్టల్లో రైతుల భూముల వివరాలు లేవంటూ ప్రతిపక్షాలు గాయిగాయి చే స్తున్నాయి. కానీ.. ధరణి పోర్టల్ కొత్త సమస్యలను సృష్టించడం లేదు. భూ రికార్డులను స్కా నింగ్ చేసి గతంలో ఉన్న సమస్యలను బయటికి తీసుకొస్తున్నది. ఉదాహరణకు.. పెండిం గ్ మ్యుటేషన్. గతంలో మ్యుటేషన్పై అవగాహన లేకనో, అధికారుల కక్కుర్తి కారణంగానో, లంచాలు ఇవ్వలేకనో లక్షల మంది మ్యుటేషన్ చేయించుకోక వారి భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ధరణి వచ్చాక రిజిస్ట్రేషన్ పేపర్ ఉంటే సరిపోతుంది. కచ్చితంగా మ్యుటేషన్ రికార్డు (1బీ) ఉంటేనే అసలైన హక్కుదారులనే విషయం తెలిసివచ్చింది.
లక్షల మంది మ్యుటేషన్ చేయించుకోలేదని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించి, వారికి యాజమా న్య హక్కులు కల్పించింది. ఇది దశాబ్దాల సమస్యకు ధరణి చూపిన పరిష్కారం.
వాస్తవానికి పట్టాభూములకు సంబంధించి దాదాపు 95 శాతం భూములు ధరణిలో రికాైర్డె ఉన్నాయి. వీటిల్లో దాదాపు ఎలాంటి సమస్యలు లేవు. మిగతావాటిలో వ్యక్తిగత వివాదాలు, కోర్టు కేసులు, పార్ట్-బీలో ఉన్న భూములే అత్యధికంగా ఉన్నాయి. అత్యధిక శాతం వారి వ్యక్తిగత సమస్యలే. కో ర్టు తీర్పు ప్రకారం వాటిని ఎప్పటికప్పు డు ఆన్లైన్ చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి ఎప్పటికప్పుడు ప్రభు త్వం పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ను ప్రవేశపెడుతూ పరిష్కరిస్తున్నది. దరఖాస్తులను నేరుగా కలెక్టర్ పరిశీలిస్తూ, రైతులకు న్యాయం చేస్తున్నారు. రెండు వారాల కిందటే కొత్తగా నాలుగు ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో 33 ట్రాన్సాక్షన్ మాడ్యూళ్లు, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి.
ఇలా ధరణి పోర్టల్ రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులను సామాజికంగా, ఆర్థికంగా ఆదుకుంటూ, వారికి కొండంత అండగా నిలిచింది. అవినీతికి ఆస్కారం లేకుండా.. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని వారి ఖాతాల్లోకి చేర్చుతున్నది. ఒకవేళ రైతు మరణించినా.. వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నది. ఇలాంటి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేస్తామన్న ప్రతిపక్షాలను నమ్మాలో.. లేదా వారినే మరోసారి బంగాళాఖాతంలో పడేసి బుద్ధిచెప్పాలో ప్రజలే నిర్ణయించాలి.
రైతుబీమా నిలిచి.. రాబందు పథకాలే దిక్కవుతాయి
గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆపద్బంధు’ పథకాన్ని తెచ్చింది. మరణించిన కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని ఘనంగా ప్రకటించింది. కానీ, ఈ సాయం పొందడానికి డెత్ సర్టిఫికెట్ తీసుకోవడం నుంచి మొదలుపెడితే దరఖాస్తు తీసుకోవాల్సిన క్షేత్రస్థాయి అధికారులు, దానిని ధ్రువీకరించాల్సిన పైఅధికారులు, మధ్యలో దూరి పెత్తనం చేసే నేతలు, చెక్కు మంజూరు చేసే అధికారులు, వాటిని డబ్బుగా మార్చే బ్యాంకర్ల వరకు ప్రతి దశలోనూ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. డబ్బులు ముట్టజెప్పడంతోపాటు అధికారుల కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడిన దుస్థితి. చివరికి ఆ కుటుంబానికి రూ.10 వేలో, రూ.20వేలో దిక్కయ్యేది. అందుకే ఆ పథకం రైతు కుటుంబాలను ఆదుకునే పథకం కాకుండా శవాలను పీక్కుతినే రాబందుల్లాంటి దళారులను మేపే పథకంగా మారింది.
ఒక వ్యక్తి లేదా కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు అందజేస్తాయి. ఇదే తరహాలో రైతుల సమగ్ర వివరాలు అధికారికంగా ప్రభుత్వం దగ్గర ఉంటేనే పాలసీలు ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొస్తాయి. ధరణి పోర్టల్తో రైతుల సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్దకు చేరాయి. ఈ రికార్డును పరిశీలించి ఎల్ఐసీ సంతోషంగా ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 59 ఏండ్లలోపు వయసున్న రైతులకు ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తున్నది. 2022-23లో 37.77 లక్షల మంది రైతుల కోసం సుమారు రూ.1,446 కోట్లు చెల్లించింది. ఒకవేళ రైతు ఏ కారణంగా మరణించినా.. ఒకటి, రెండు వారాల్లోనే వారి కుటుంబసభ్యుల ఖాతాల్లోకి రూ.5 లక్షలు వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. రైతు మరణించిన విషయం వ్యవసాయశాఖ అధికారికి చెప్పి, డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలు సమర్పిస్తే చాలు.. ఇన్సూరెన్స్ ప్రక్రియ మొదలైపోతుంది. కంపెనీ నుంచి నేరుగా ఖాతాలో వచ్చి పడుతుంది. ఇలా ఇప్పటి వరకు సుమారు లక్ష మంది రైతుల కుటుంబాలకు రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం అందింది.
ధరణి పోర్టల్ను ఎత్తివేసే ప్రభుత్వం దగ్గర అధికారిక రికార్డు మాయం అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ససేమిరా అంటాయి. ఫలితంగా మరణించిన రైతుల కుటుంబాల బతుకులు మళ్లీ రాబంధుల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
అర్ధగంటకే రిజిస్ట్రేషన్ అయ్యింది
మా గ్రామంలో నా భర్త పేరున 6.20 గుంటల వ్యవసాయ భూమి ఉండేది. ఆయన చనిపోతే ఆ భూమిని నా పేరున పట్టా చేయించుకోవడానికి అప్పట్లో నానా యాతలు పడ్డ. పైసలు పోయినా పనికాక ఇబ్బందులు పడ్డ. వచ్చిన అధికారులందరికీ అడిగిన కాడికి ఇచ్చినం. నేను, నా పిల్లలు తిరిగి తిరిగి వేసారి పోయినం. ఇప్పుడు నా పేరు మీదున్న 6.20 గుంటల భూమిని ఇటీవల నా కూతురుకు పసుపు కుంకుమల కింద రెండెకరాలు, నా కొడుకుకు 4ఎకరాలు పట్టా చేయించా. నా వేలిముద్రలు వేసి, ఫొటో దిగిన. అర్ధగంటకే పని అయిపోయిందని కాగితాలు ఇచ్చారు.
– జూకూరి పద్మ, లింగాల గ్రామం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా
ధరణితో సులువుగా రిజిస్ట్రేషన్
ధరణితో సులువుగా భూముల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ధరణి రాక ముందు రిజిస్ట్రేషన్కు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు పని అయ్యేది కాదు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో నిమిషాల వ్యవధిలో పని పూర్తవుతున్నది. రాత పద్ధతిలో పట్టా పాస్ పుస్తకం ఏండ్లకు ఏండ్లు తిరిగే పద్ధతికి ధరణి ద్వారా తెరపడింది. వ్యవసాయ భూమి వివరాలన్నీ ధరణి పోర్టల్లో ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్లలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తక్కువ సమయంలోనే అయిపోతున్నది.
– రెంటపల్లి కోటయ్య, మాటూరుపేట గ్రామం, మధిర మండలం, ఖమ్మం జిల్లా
రైతుబీమా ప్రారంభం: 2018
ప్రస్తుత కవరేజీ: రూ. 37.77 కోట్లు లక్షల మంది
ఇప్పటి వరకు చెల్లించిన ప్రీమియం: రూ.5,383 కోట్లు
బీమా పొందిన కుటుంబాలు:1,00,782
పొందిన ఆర్థిక సాయం:రూ 5,039 కోట్లు