ఆదిలాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ సీసీఐని పునః ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా లేనందున.. తాము గతంలో పరిశ్రమకు ఇచ్చిన భూ ములను తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సదరు భూముల్లో పంటలు పండించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ సీసీఐ రూ.47 కోట్ల వ్యయంతో 1982 ఆగస్టు 15న ప్రారంభం కాగా, 1984లో అప్పటి కేంద్ర మంత్రి ఎన్డీ తివారీ, ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీ రామారావు జాతికి అంకితం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు చిన్నాచితక ఉద్యోగాలిచ్చారు. సీసీఐ ఏర్పాటులో భాగంగా ఆదిలాబాద్ సమీపంలోని లాండసాంగ్వి, చాందా, బెల్లూరి, తిర్పెల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతుల వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వం 780 ఎకరాల భూమిని సేకరించింది.
భూములు పోయినా, తమ ప్రాంతం బాగుపడటమే కాకుండా తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో రైతు లు భూములిచ్చారు. కేంద్రం ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించింది. భూములు కోల్పోయిన వారికి చిన్న ఉద్యోగాలు ఇచ్చిన అధికారులు వారిని బదిలీల పేరిట భయపెట్టి బలవంతంగా వీఆర్ఎస్ తీసుకునేలా ఒత్తిడి చేశారు. దీంతో కొందరు పదేండ్లు కూడా ఉద్యోగాలు చేయలేకపోయారు. వీఆర్ఎస్ సమయంలో రూ.1.50 లక్షల వరకు చెల్లించారు.
భూములు, ఉద్యోగాలు కోల్పోయిన నిర్వాసితులు తమను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని 15 ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పరిశ్రమను పునః ప్రారంభించాలని లేకుంటే తమ భూములను తిరిగి ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు. గతంలో తాము పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో పంటలు వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు సదరు భూముల్లో దుక్కులు దున్నడం మొదలుపెట్టారు.
అప్పట్లో భూములు గుంజుకున్నరు..
మాకు 24 ఎకరాల భూమి ఉండే. మా నాన్న రాజన్న వ్యవసాయం చేస్తుండే. సిమెంటు పరిశ్రమకు భూములిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారులు మభ్యపెట్టి గుంజుకున్నరు. ఎకరాకు రూ. 3 వేల చొప్పున 24 ఎకరాలు తీసుకున్నరు. మా నాన్న కు 1982లో స్వీపర్ ఉద్యోగం ఇచ్చిన్రు. పదేండ్ల తర్వాత ఇతర ప్రాంతానికి బదిలీ చేస్తామంటూ బలవంతంగా వీఆర్ఎస్ తీసుకొనేలా చేసిన్రు.
భూములు కోల్పోయిన మాకు ఎలాంటి ఉపాధి లేదు. పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తే మంచిగుంటది. లేదంటే మా భూములన్నా ఇయ్యాలె అని పదిహేనేండ్లుగా ఆందోళనలు చేస్తున్నం. ఈ ఏడాది నుంచి మా భూముల్లో ఎవుసం చేయాలని నిర్ణయించుకున్నం. దుక్కి దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధం చేసినం.
–వోర్కే అశోక్, నిర్వాసితుడు, బెల్లూరి