నందిపేట్(నిజామాబాద్) : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్(ఔరంగాబాద్ -Aurangabad District)లో ఈనెల 24న నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ(Preparations BRS meeting) ఏర్పాట్ల పనులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో జరిగే సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక పార్టీ నాయకులకు సూచించారు. సభకు సంబంధించి వివిధ రూట్లను ఏర్పాటు చేయాలని, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి అనువైన పార్కింగ్ స్థలాలను(Parking Places) ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కు ఆత్మీయ స్వాగతం పలకడానికి ఔరంగాబాద్ జిల్లా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు.
ఆ జిల్లా చరిత్రలోనే బీఆర్ఎస్ సభ అతి పెద్దదిగా రికార్డు సృష్టిస్తుందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 450 పథకాలను ఔరంగాబాద్ సభ ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారన్నారు. భారీ ఆదాయ వనరులు, అతి పెద్ద బడ్జెట్లో మొదటి వరసలో ఉన్న మహారాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో మాత్రం ఆఖరి వరసలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను అమలు చేస్తామన్నారు. అసాధ్యమనే పదానికి కేసీఆర్(CM KCR) డైరీలో చోటు లేదని అన్నారు.
కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, ప్రముఖ వాస్తు నిపుణులు తేజశర్మ, యువనాయకులు అంకిత్ యాదవ్, శివాంక్ యాదవ్ పాల్గొన్నారు.