సంగారెడ్డి, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలోఉన్నదని.. తలసరి ఆదాయం, ఆర్థికవృద్ధి రేటు, ఆరోగ్యం, తాగు, సాగునీరు ఇవ్వడంలో అజేయంగా నిలిచిందని చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దశదిశను చూపుతున్నదని అన్నారు. ఇదంతా మింగుడు పడకనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంపై కక్షగట్టిందని, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఉర్దూ జూనియర్ కళాశాలను, మొగుడంపల్లిలో గిరిజన బాలికల ఇంగ్లిష్ మీడియం జూనియర్ కళాశాలను, రైతు వేదికను శనివారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
అనంతరం మొగుడంపల్లిలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఏనాడూ మంచి స్కూల్ కట్టాలని, కళాశాల కట్టాలన్న కల కూడా కనలేకపోయారని విమర్శించారు. స్వరాష్ట్రంలో గురుకులాల పాఠశాలలు, కళాశాలలకు అత్యద్భుత భవనాలను కట్టించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన విద్యాలయాల సంఖ్యను 91 నుంచి 183కు పెంచిందని స్పష్టంచేశారు. బాలికలు మంచిగా చదువుకొనేందుకు 20 గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రారంభించినట్టు తెలిపారు.
రాబోయే రోజుల్లో గురుకులాల్లో లాకాలేజీ, పీజీ కాలేజీలను కూడా ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలకు కలిపి మొత్తం 298 గురుకులాలు ఉండేవని, నేడు వాటిసంఖ్య 923కు పెరిగిందని చెప్పారు. ఉమ్మడి పాలనలో గురుకులాల మీద రూ.350 కోట్లు వెచ్చించేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3,300 కోట్లు వెచ్చిస్తున్నదని ఉద్ఘాటించారు. ఆయా కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.