తొలిసారి సిద్ధంచేసే పనిలో విద్యాశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపుకార్డులు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్సియల్ స్కూళ్ల టీచర్లందరికీ ఐడీకార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. టీచర్లకు గుర్తింపు కార్డులివ్వడం విద్యాశాఖ చరిత్రలో తొలిసారి కానుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 1.2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీచర్లకు గుర్తింపుకార్డులిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ టీచర్లందరికీ ఐడీ కార్డులివ్వాలని నిర్ణయించింది. కార్డు డిజైన్ను ఖరారుచేశారు. కార్డుకు రూ.42 చొప్పున చెల్లించేందుకు అంగీకరించి ఓ ముద్రణా ఏజెన్సీని ఎంపికచేశారు. ప్రస్తుతానికి జిల్లాలవారీగా పదవీ విరమణ, చనిపోయిన ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టనుండటంతో ఆ ప్రక్రియ పూర్తికాగానే ఐడీకార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు.