Telangana | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆర్థికరంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ఐడెక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాల్ కోశి పేర్కొన్నారు. రుణాలు-జీడీపీ రేషియోలో దేశంలోనే తెలంగాణ ఉత్తమంగా ఉన్నదని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని, జీఎస్డీపీ గ్రోత్రేట్ అద్భుతంగా ఉన్నదని కితాబిచ్చారు. దేశానికి దక్షిణాది రాష్ర్టాలే జీవనాడని, దేశ జీడీపీలో దక్షిణాది ఐదు రాష్ర్టాల వాటానే 30 శాతం ఉన్నదని వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఆధారంగా దేశ ఆర్థక వ్యవస్థకు తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ర్టాలే ఆయువు పట్టని పాల్ కోశి వెల్లడించారు. ఐడెక్ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ.
2022-23 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్డీపీ రూ.24.8 లక్షల కోట్లు, కర్ణాటక జీఎస్డీపీ రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ జీఎస్డీపీ రూ.13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు, కేరళ జీఎస్డీపీ రూ.10 లక్షల కోట్లు ఉన్నది. దేశంలో దక్షిణాది రాష్ర్టాల జనాభా వాటా 19 శాతం. మిగిలిన రాష్ర్టాల జనాభా వాటా 79 శాతం. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా 30 శాతం. దేశాన్ని సాకుతున్న రాష్ర్టాల్లో దక్షిణాదే కీలకపాత్ర పోషిస్తున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం..తెలంగాణ రూ.2,75,443 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నది. ఆ తర్వాత దక్షిణాది రాష్ర్టాల్లో రూ.2,65,623తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు రూ.2,41,131, కేరళ రూ.2,30,601 తలసరి ఆదాయంతో మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రూ. 2,07,771 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ జాతీయ సగటు రూ.1,50,007 కంటే ఎకువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.
రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నదని చెప్పడానికి జీఎస్డీపీలో రుణాల రేషియో ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని ఆర్బీఐ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. రుణాలు-జీడీపీ రేషియో తకువగా ఉంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్నట్టు ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ విషయంలోనూ దక్షిణాది రాష్ర్టాలు ముందు వరుసలో ఉన్నాయి. అందులోనూ తెలంగాణ టాప్ ప్లేస్లో నిలుస్తున్నది. రుణం-జీడీపీ రేషియో అతి తకువగా తెలంగాణాలో 25.3 శాతంగా ఉన్నది. కర్ణాటకలో 27.5 శాతం, తమిళనాడులో 27.7 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 32.8 శాతం, కేరళలో 37.2 శాతంగా ఉన్నది. ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే ఈ ఐదు దక్షిణాది రాష్ర్టాలు రుణాలు తీసుకోవడంలోనూ ఆదర్శంగానే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఐదు రాష్ర్టాల్లోనూ బీజేపీ అధికారంలో లేదు.