జనగామ : సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని చంపక్ హిల్స్లో 2 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మానవ విసర్జితాల శుద్ధీకరణ ప్లాంట్ ఽను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల జమున, జనగామ కలెక్టర్ శివలింగయ్యలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది..తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ ఆదర్శనీయుడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనగామ ప్రజలు అండగా ఉండాలన్నారు.
జనగామ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళి కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.