సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరాన్ని ట్రాఫిక్ సమస్య ఇంకనూ పట్టి పీడిస్తూనే ఉంది. మహా నగరానికి ఔటర్ రింగు రోడ్డు మణిహారంలా మారింది. నగరం నుంచి ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు వెళ్లాలన్నా ఎంతో సులభంగా చేరుకునే నగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు 158 కి.మీ పొడవునా అందుబాటులో ఉంది. ప్రధానంగా ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి నుంచి నార్సింగి వద్దనున్న ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న లింకు రోడ్డుతో పాటు అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు, ఇటు కొల్లూరు వైపు ఉన్న ఓఆర్ఆర్ పూర్తిగా ఐటీ కారిడార్లో భాగంగా ఉంది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది.
దీంతో ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీఈఎస్ కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు భారీ సంఖ్యలో వెలిశాయి. ఫలితంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలైన గచ్చిబౌలి, నానక్రాంగూడ, నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, కొల్లూరు, తెల్లాపూర్, గౌలిదొడ్డి, గోపన్పల్లి ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా జన సాంద్రత పెరిగింది. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణ సమయంలో మెయిన్ క్యారేజ్ వేను ఎనిమిది వరసల్లో నిర్మించారు. కాని, దానికి ఇరువైపులా సర్వీసు రోడ్లు 2 వరసల్లోనే నిర్మించారు. అయితే, ఐటీ కారిడార్లో ఊహించిన స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో ఐటీ కార్యాలయాలకు వచ్చే వారితో పాటు ఆ చుట్టూ నివాసం ఉండే వారిలో ఈ ప్రాంతం రద్దీగా మారింది. కోకాపేట, నార్సింగి కేంద్రంగా మూడు వైపులా వెళ్లే ఔటర్ రింగు రోడు సర్వీసు రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది.