Telangana | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ తరహాలో పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి సైతం గతంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన ప్రస్తుతం 33గా ఉన్న జిల్లాల సంఖ్య దాదాపు తగ్గిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు, మూడు అటూఇటుగా 20 వరకు జిల్లాలు ఏర్పాటు చేయొచ్చని చర్చ జరుగుతున్నది. అంటే కనీసం 13-15 జిల్లాల విలీనం తప్పదన్నమాట. దీంతో కొత్త జిల్లాలు కేంద్రంగా సవ్యంగా సాగుతున్న పాలన మళ్లీ దెబ్బతింటుందన్న ఆందోళన మొదలైంది. ఏ జిల్లా ఉంటుంది? ఏ జిల్లా పోతుంది? అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు జిల్లాల సంఖ్యను కుదిస్తే అనేక కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయం, డబ్బు వృథా అవడంతోపాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలకు నష్టం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రతిపాదికన ఒక్కో జిల్లా చేస్తే.. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నదని, మరి అప్పుడు కూడా మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలు తగ్గిస్తే కలెక్టర్ పోస్టులు మొదలు అన్ని శాఖల జిల్లాస్థాయి హెచ్వోడీలు, ఆయా కార్యాలయాల్లో పనిచేసే అటెండర్ల వరకు అన్ని పోస్టులు రద్దు అవుతాయని చెప్తున్నారు. ఫలితంగా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పడిపోతుందని అంటున్నారు. ఇప్పుడు పదోన్నతులు వేగంగా వస్తున్నాయని, జిల్లాల సంఖ్య తగ్గితే ఆలస్యం అవుతాయని వెల్లడిస్తున్నారు. జిల్లాల ఏర్పాటుతో జోన్ల విభజన కూడా జరగాలని, ఇవన్నీ అధికారికంగా అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనుమతి కావాల్సి ఉంటుందని, ఇది పూర్తి కావడానికి కనీసం ఒకటి, రెండేండ్లు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్లు వేయడానికి ఆస్కారం ఉండదని, ఫలితంగా నిరుద్యోగులు నష్టపోతారని వివరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రాల్లో నిర్మించిన భవనాలన్నీ వృథా అవుతాయని, జిల్లాల వారీగా పార్టీలు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అనుబంధ కమిటీలు ఇలా వందల మందికి పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాయి. వారంతా పదవులు కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆలోచనతో ప్రయోజనం దాదాపు శూన్యమని చర్చ జరుగుతున్నది.