హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టి దిగుబడులను పెంచేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. దేశంలోని వివిధ శీతోష్ణ, భూసార పరిస్థితులను ఆధారంగా చేసుకుని అఫ్లోటాక్సిన్ (ఆస్పిరిజెల్లా)ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నది. అఫ్లోటాక్సిన్ క్యాన్సర్కు దారితీస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తుండటంతో ఆ ఫంగస్ సోకిన వేరుశనగ వినియోగాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు పూర్తిగా నిషేధించగా, మరికొన్ని దేశాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పిరిజెల్లాను నియంత్రించగలిగితే వేరుశనగ దిగుబడితోపాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని, అందుకే ఆ సమస్యలపై దృష్టి సారించామని ఇక్రిశాట్ పరిశోధకులు వెల్లడించారు.