సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ 11 వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను ఆంద్రప్రదేశ్లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని ఆయన తెలిపారు. అలాంటి మహానుబావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు.ఈ రోజున సార్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాను కన్న కలలు సాకారం అవుతున్నందుకు ఎంతగానే సంబురపడేవారని మంత్రి చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత తోటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాదించిందన్నారు. అంతకు మించి వేగవంతమైన వ్యవసాయ అభివృద్ధి, విద్యుత్ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలు సాధించాం. పారిశ్రామిక రంగంలో కొత్తగా ప్రకటించిన పాలసీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది అంటే జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ చేస్తున్న పాలనకు నిదర్శనమని మంత్రి కొనియాడారు.