గోవిందరావుపేట, మే 30: ములుగు జిల్లా లక్నవరం సరస్సులో మునిగి ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్లోని ఇక్ఫై బిజినెస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు హర్ష, సాయిప్రీతం, వర్షిత, అమృత, కీర్తన, తరుణి సోమవారం లక్నవరం సరస్సులోని రెండో ఐలాండ్లో కాటేజీలకు చేరుకున్నారు. సాయంత్రం ఆరుగురు కలిసి నీళ్లలోకి దిగారు.
ఈ క్రమంలో సాయిప్రీతం (21), తరుణి (20) తోటి విద్యార్థుల కళ్ల ముందే నీటముగిపోయారు. వారు టూరిజం సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకొన్న పస్రా సీఐ శంకర్, ఎస్సై కరుణార్రావు హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో మృతదేహాలను సరస్సులో నుంచి ఈతగాళ్లు వెలికి తీశారు.