మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భూములను బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు నేతృత్యంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.
91 సర్వే నంబర్లలోని 1,525 ఎకరాల్లో 1,350 ఎకరాలను దేవాలయ భూములుగా ఈ కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలు వెలిసిన ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సీతారామచంద్రస్వామి దేవాలయానికి అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని ఐఏఎస్ల కమిటీ నివేదించినట్టు తెలుస్తున్నది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయానికి 1925లో నిజాం నవాబు భూములను కేటాయించారు. నిజాం నవాబు వద్ద పనిచేసే రామిడి పుల్లయ్య విజ్ఞప్తి మేరకు కేటాయించిన ఈ భూములు ఈటల రాజేందర్ కనుసన్నల్లోనే కబ్జాకు గురైనట్టు దేవరయాంజల్ గ్రామస్తులు గతంలోనే విచారణ కమిటీకి తెలిపారు.