ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లో వున్నా.. మనుసుగల్లది తెలంగాణ సమాజం. ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని తెలిస్తే చాలు.. హోదాలన్నీ పక్కన బెట్టి… దుఃఖంలో పాలు పంచుకుంటారు. ఇబ్బందుల నుంచి బయటపడేసి, ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేస్తారు. తెలంగాణ ఆత్మలోనే అంత సౌందర్యముంది. ఇప్పుడు ఓ ఐఏఎస్ తెలంగాణలోని ఆత్మ సౌందర్యాన్ని కష్టాల్లో వున్న ప్రజలకు పంచుతున్నారు.
వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి… కన్నీరు మున్నీరు అవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే… మోకాళ్ల లోతు బురదలో నడుస్తూ, ప్రజల ఇబ్బందులను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. ఆ ఐఏఎస్ పేరు కీర్తి జల్లి. ఆమె స్వస్థలం వరంగల్. ఐఏఎస్గా అసోంలోని కచార్ డిప్యూటీ కమిషనర్గా సేవలందిస్తున్నారు. ఆమె అక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడాన్ని చూసి యావత్ సోషల్ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజల కష్టాలను తెలుసుకోడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్లు కూడా ముచ్చటపడుతున్నారు. మెచ్చుకుంటున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా అసోం తీవ్రంగా దెబ్బతింది. రహదారులు, రోడ్లు, భవనాలు.. ఇలా అన్నీ నాశనమైపోయాయి. ఈ నేపథ్యంలో అసోంలోని కచార్ వరద బాధిత ప్రాంతాల్లో కీర్తి జల్లి విస్తృతంగా పర్యటించారు. మోకాళ్ల లోతులో వున్న బురదలోకి కూడా ఆమె దిగారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దగ్గరి నుంచి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారాలను చూపుతున్నారు.
ఆమెకు వృత్తిపై వున్న నిబద్ధత, ప్రజల పట్ల వున్న మమకారానికి అందరూ ఫిదా అయ్యారు. తోటి ఐఏఎస్లు కూడా ఫిదా అయిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలను అవనీశ్ శరణ్ అన్న ఐఏఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఓ బోటులో ప్రయాణిస్తూ… ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు.
Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.🙏 pic.twitter.com/n5CsOoAFMu
— Awanish Sharan (@AwanishSharan) May 26, 2022