హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/తూప్రాన్: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం (పీసీ 7 ఎంకే) సాంకేతిక లోపంతో కుప్పకూలింది. సోమవారం ఉదయం మెదక్ జిల్లా తూప్రా న్ మండలం రావెల్లి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. వీరిలో ఒకరు పైలట్ కాగా.. మరొకరు ట్రైనీ పైలట్. దుండిగల్ ఎయిర్ఫోర్స్కు చెందిన శిక్షణ విమానం రోజువారీ ట్రైనింగ్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు ఉవాన్తాయి, అభిమన్యులతో ఎయిర్బేస్ నుంచి బయలుదేరింది.
రావెల్లి శివారుకు రాగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో ఉన్న రాళ్లగుట్టపై కూలిపోయింది. వెంటనే మంటలు అంటుకోవడంతో విమానంలో ఉన్న వియ త్నాం దేశస్థుడు ఉవాన్తాయి, అభిమన్యు కాలిబూడిదయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న దుండిగల్ ఎయిర్ఫోర్స్ అధికారులు సీఎన్సీ నాయర్, వింగ్ కమాండర్ శ్రీనివాసన్ ప్రత్యేక విమానంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడే పంచనామా నిర్వహించారు. ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.