హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ దాడులు గురువారం ఉదయం 11 గంటలకు ముగిశాయి. సాధారణంగా అధికారులు పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. కానీ, మంత్రి మల్లారెడ్డి విషయంలో ఐటీ నివేదిక ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాని కంటే ముందే బీజేపీ కార్యాలయానికి చేరినట్టున్నది. ఐటీదాడులు పూర్తయిన వెంటనే వివరాలన్నీ రాష్ట్ర బీజేపీ నేతలకు తెలిసినట్టున్నాయి. బీజేపీ రాష్ట్ర కోశాధికారి బీ శాంతికుమార్ మధ్యాహ్నం మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన వివరాలే ఇందుకు నిదర్శనం. ఐటీ దాడులు పూర్తయిన రెండుమూడు గంటల్లోనే శాంతికుమార్ ప్రెస్మీట్ పెట్టారు.
ఐటీశాఖ అధికారులు ఇచ్చిన వారంటును మంత్రి చించేశారని, ల్యాప్టాప్ను పరిశీలిస్తుంటే దానిని ఎత్తుకెళ్లారని, మొబైల్ను దాచిపెట్టారని, ఇలా అక్కడే పక్కన ఉండి చూసినట్టు చెప్పారు. పైగా.. నగదు రూ.8 కోట్లు సీజ్ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని, కానీ, రూ.18 కోట్లు నగదు దొరికిందని బల్లగుద్దిమరీ చెప్పారు. మల్లారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు పెట్టారంటూ.. వరుసగా ఆయా సెక్షన్లను చదువుకుంటూ పోయారు. ఇవన్నీ మీకెలా తెలిశాయని అడిగితే.. ఢిల్లీలో ఉన్న విశ్వసనీయ వర్గాలు చెప్పాయని బుకాయించారు. పైగా ఐటీ అధికారులు బులెటిన్ ఢిల్లీకి పంపించారని, శుక్రవారం మీడియాకు రిలీజ్ చేస్తారని చెప్పారు. ఢిల్లీకి పంపిన సమాచారం బీజేపీ నేతలకు ఎవరిచ్చారని మీడియా ప్రతినిధులు అడిగితే ‘మా సోర్స్ ద్వారా తెలిసింది’ అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించా రు. ఐటీ అధికారులు ప్రభుత్వానికి పంపించారా? లేక ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్కు రిపోర్ట్ చేశారా? అని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. చివర గా మంత్రికి ఈడీ కూడా నోటీసులు ఇస్తుందని చెప్పారు. ఐటీ అధికారులు అత్యంత గోప్యంగా ఢిల్లీకి నివేదిక పంపిస్తే.. గంటల్లోనే సెక్షన్లతో సహా రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలా తెలిసిందని రాజకీయ విశ్లేషకులు, టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టే ఐటీ, ఈడీ.. బీజేపీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయని అర్థం అవుతున్నదని మండిపడుతున్నారు.