ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను ఓ సులభ్ కాంప్లెక్స్ దగ్గర వదిలేసి వెళ్లింది. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చొన్న పిల్లలను పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల కోసం వెతికినా ప్రయోజనం లేదు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పత్రిక ప్రకటన ఇచ్చింది. అయినా, పిల్లల కోసం ఎవరూ రాలేదు. ఆ ముగ్గురు పిల్లలను యూఎస్కు చెందిన ఓ వ్యక్తి దత్తత తీసుకొన్నారు. 2020లో వీసా తీసుకొని యూఎస్ వెళ్లిన ఆ పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. పిల్లల పాత ఫొటో, ప్రస్తుత ఫొటో పక్కపక్కన పెట్టి చూస్తే వాళ్లేనా! అనేంతగా మారిపోయారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పిల్లలను పోషించలేకో.. ఆడపిల్ల పుట్టిందనో.. అవాంఛిత గర్భం కారణంగానో పుట్టిన పసిబిడ్డలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అండగా నిలుస్తున్నది. అలా వదిలేసిన చిన్నారులను పిల్లలు లేని వారికి, ఆసక్తి ఉన్న వారికి దత్తత ఇస్తున్నది. ఇలా ఆదిలాబాద్లోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (ఏఎస్ఏఏ) శిశు గృహ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన 108 మంది అనాథ పిల్లలను దత్తత ఇచ్చింది. ఇందులో 79 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లగా, మరో 17 మంది దేశంలోని వివిధ రాష్ర్టాలకు దత్తత వెళ్లారు. మిగిలిన 12 మంది విదేశాలకు దత్తత వెళ్లడం గమనార్హం. మరీ ముఖ్యంగా దత్తత తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటున్నారు. పిల్లల కోసం దరఖాస్తు చేసుకొనే వారు తమకు ఆడపిల్లలే కావాలని అడుగుతున్నారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
దత్తత కోసం దరఖాస్తు చేసుకొంటున్న వారిలో అధిక శాతం ఆడపిల్లలే కావాలని దరఖాస్తుల్లో స్పష్టంగా పేర్కొంటున్నారు. లింగ వివక్ష, ఆడపిల్లలు వద్దు అని వదిలేసే ఘటనలు నేటికీ నమోదవుతున్న తరుణంలో ఆడపిల్లలనే దత్తత తీసుకొంటామని చాలా మంది ముందుకు రావటం విశేషం. దరఖాస్తుల్లో 75 శాతం నుంచి 80 శాతం మంది ఆడపిల్లలను దత్తత తీసుకొంటుండగా, 10 శాతం మంది ఎవరైనా ఫర్వాలేదని, మిగిలిన 10 శాతం మంది అబ్బాయిలు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఆడ, మగ అన్న తేడా లేదు. ఎవరైనా సరే బాగా చదివిస్తే తమను బాగా చూసుకొంటారని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలను దత్తత తీసుకొనేందుకే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఏడాదికి లక్షన్నరకు పైగా ఆదాయం ఉన్న ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఇందుకు వయసు పరిమితులు ఉంటాయి. ఇద్దరు తల్లిదండ్రులు లేదా సింగిల్ పేరెంట్ కూడా దత్తత తీసుకోవచ్చు. సింగిల్ పేరెంట్ మగవారైతే మగపిల్లాడిని మాత్రమే దత్తత తీసుకొనేందుకు అర్హులు. ఆడవారైతే మగ, ఆడ ఇద్దరిలో ఎవరు కావాలనుకుంటే వారిని దత్తత తీసుకోవచ్చు. ఇప్పటికే ఒక సంతానం ఉండి, ఇంకొకరిని దత్తత తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉండి మూడో దత్తత కావాలంటే మాత్రం ఇవ్వరు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా పిల్లలను అడా ప్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా, చట్టప్రకారం ఈ ప్రక్రియ నడుస్తుంది. దత్తత తీసుకోవాలనుకొనే తల్లిదండ్రుల వయసు ఆధారంగా పిల్లలను అప్పగిస్తారు.
బాలల సంరక్షణ చట్టం-2015, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్ఏ) గైడ్లైన్స్ను అనుసరించి పిల్లలను దత్తత తీసుకోవడం మేలు. దీని ద్వారా పిల్లలకు చట్టబద్ధత ఏర్పడుతుంది. పిల్లలు కావాలనే ఆరాటంతో ఎలాగోలా దత్తత తీసుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో వారసత్వ హక్కు దొరక్క పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దత్తత తీసుకొన్నాక ఆ దంపతులకు మరో సంతానం కలిగినప్పుడో, దత్తత తీసుకొన్న దంపతుల బంధువుల ద్వారానో ఆస్తులు, ఇతర హక్కుల విషయంలో వెనక్కి తగ్గాల్సి వస్తున్నది. చట్టప్రకారం సీఏఆర్ఏ ద్వారా దత్తత తీసుకొంటే పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు వస్తాయి. అవసరమైతే కోర్టుకు వెళ్లి వారి హక్కులను కాపాడుకొనే చాన్స్ ఉంటుంది. బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలనుకొన్నా సీఏఆర్ఏ ద్వారా చేసుకోవటమే ఉత్తమం. ఈ ప్రక్రియ నెల లోపలే అయిపోతుంది. పెద్దగా ఇబ్బంది ఉండదు.
వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొన్నాక దరఖాస్తుదారుల లిస్ట్లోకి మీ వివరాలు ఎంటర్ అవుతాయి. క్రమపద్ధతిలో ఒకరి తర్వాత ఒకరికి పిల్లలను దత్తత ఇస్తూ వస్తారు. మీ వంతు రాగానే పిల్లల వివరాలన్నీ మెసేజ్ రూపంలో పంపిస్తారు. పిల్లల హెల్త్ కండిషన్, సోషల్ కండిషన్, ప్రవర్తన ఇలా అన్ని విషయాలను అందులో పేర్కొంటారు. ఈ మెసేజ్ వచ్చిన 48 గంటల్లోపు పిల్లలు కావాలనుకొంటే రిజర్వ్ చేసుకోవాలి. లేదా మీ తర్వాతి వారికి ఆ మెసేజ్ వెళ్తుంది. ఒక సారి దరఖాస్తు చేసుకున్నా ప్రక్రియ మొత్తం పూర్తయి పిల్లలను అప్పగించడానికి కనీసం రెండేండ్లు పడుతుంది.
వెబ్సైట్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మా బృందం తనిఖీకి వెళ్తుంది. దరఖాస్తులో వారు పేర్కొన్న వివరాలు సరైనవని, వారు పిల్లలను పెంచగలరని నమ్మకం కుదిరాకే అప్రూవల్ ఇస్తాం. పిల్లలను దత్తత ఇచ్చాక రెండేండ్ల వరకు ఆరు నెలలకోసారి మానిటర్ చేస్తాం. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవంటేనే కొనసాగిస్తాం. ఇప్పటి వరకైతే అలాంటి ఇబ్బందులు ఏవీ రాలేదు. చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకోవడం మంచిది. మన దేశంతో పాటు విదేశీయులకు అర్హతను బట్టి పిల్లలను దత్తత ఇస్తాం.
– చిన్నయ్య, డీడబ్ల్యూవో, మంచిర్యాల
పిల్లలు అనాథగా మాకు దొరికినప్పుడు చాలా బాధ అనిపిస్తది. అదే పిల్లలను వేరే వాళ్లు దత్తత తీసుకొని వారికి మంచి జీవితాన్ని కల్పిస్తుంటే చూసి సంతృప్తిగా ఉంటుంది. విదేశాలకు దత్తత వెళ్లిన పిల్లలనైతే గుర్తుపట్టనంతగా మారిపోయారు. వాళ్లను చూసి మాకే ఆశ్చర్యం వేసింది. పిల్లలను దత్తత తీసుకొనేప్పుడు రూ.40 వేలు, ఆ తర్వాత రెండేండ్లు 6 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున చెల్లించాలి. అంతకుమించి ఎక్కువ డబ్బులు తీసుకోరు. దత్తత తీసుకోవాలనుకొనే వారు మరిన్ని వివరాలకు 9441506519, 9908541697, 7989597093 నంబర్లను సంప్రదించాలి.
– ఆనంద్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, మంచిర్యాల
దత్తత తీసుకోవాలనుకొనేవారు www. cara. nic.in వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దత్తత కోసం కొన్ని ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఆ సర్టిఫికెట్స్ అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే దరఖాస్తు పూర్తవుతుంది.