హైదరాబాద్, జనవరి 26: దేశంలోనే అతిపెద్ద జాతీయ స్థాయి పోటీ ‘టీసీఎస్ అయాన్ ఇంటెల్లిజెమ్’లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని కొండూరు సంస్కృతి రన్నరప్గా నిలిచింది. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక.. సీనియర్ క్యాటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దేశంలోని 5-9 తరగతుల విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను వెలికితీసేందుకు టీసీఎస్ అయాన్.. ఇంటెల్లిజెమ్ పోటీని నిర్వహిస్తున్నది. సార్వత్రిక విలువలు, ప్రపంచ పౌరసత్వం, సమాచార నైపుణ్యాలు, సృజనాత్మకత-ఆవిష్కరణ, ఆర్థిక అవగాహన అంశాలపై పోటీ ఉంటుంది. ఇందులో భాగంగా.. సార్వత్రిక విలువలు, ఆర్థిక అవగాహన అంశాల్లో సంస్కృతి గ్రాండ్ ఫినాలే వరకు చేరుకొని పలువురి ప్రశంసలు అందుకొన్నది.
వరుసగా రెండు సార్లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న బాలిక ఈమే. దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు పోటీపడిన ఇంటెల్లిజెమ్లో 5 క్యాటగిరీల నుంచి 48 మంది విద్యార్థులు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ పోటీలో సంస్కృతి నాలుగు క్యాటగిరీల్లో సెమీఫైనల్ చేరి, రెండు క్యాటగిరీల్లో ఫైనల్ వరకు చేరుకున్నది. అత్యంత పోటీ ఉంటే ఆర్థిక అవగాహన, సార్వత్రిక విలువలు అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆమె ఈ స్థాయికి చేరుకోవటం గొప్ప విషయమని విద్యావేత్తలు అంటున్నారు. రాబోయే రోజుల్లో సంస్కృతి విన్నర్ టైటిల్ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.