Hyderabadis to check quality meat | హైదరాబాదీలు భోజనప్రియులు.. ప్రత్యేకించి మాంసాహార ప్రియులు.. పరిశుభ్రమైన.. నాణ్యతతో కూడిన మాంసం మాత్రమే తినాలని సిటీ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సూచించింది. పరిశుభ్రమైన.. నాణ్యమైన మాంసం మాత్రమే తినాలని పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అపరిశుభ్ర మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేస్తున్నా మార్పు రావడం లేదు. ఫలితంగా హైదరాబాదీలు అపరిశుభ్ర మాంసాన్నే తింటున్నారని పేర్కొంది.
ఈ పరిస్థితుల్లో అధీకృత షాపుల్లో మాత్రమే మాంసం కొనుగోలు చేయాలని, వాటిల్లో మాంసం విక్రయాలను మాత్రమే పర్యవేక్షించేందుకు.. నాణ్యత పాటించేందుకు అవకాశం ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం తినే వారికి మాత్రమే కాక.. మాంసం విక్రేతలకూ వర్తిస్తుందని అంటున్నారు.
పలు ప్రీమియం హోటళ్లలో అపరిశుభ్ర మాంసం వినియోగిస్తున్నట్లు గత జనవరిలో జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు అపరిశుభ్ర మాంసం వాడుతున్న హోటళ్లు, విక్రయిస్తున్న దుకాణాలకు సంబంధించి 683 మందిపై జీహెచ్ఎంసీ కేసులు నమోదు చేసింది.
వారిపై రూ.18 లక్షల పెనాల్టీ విధించింది. 1,222.5 కిలోల అపరిశుభ్ర మాంసం, 1399 కిలోల బీఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనారోగ్యానికి గురైన.. మరణించిన గొర్రెలు, మేకల మాంసం తింటే అనారోగ్యం బారీన పడతారు. వధశాలలు సమీప పశుశాలల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చి వధించి మాంసం తీస్తారు.
వధించడానికి ముందు వాటికి పరీక్షలు జరుపుతారు. గొర్రెలు, మేకల వధ తర్వాత సిద్ధం చేసిన మాంసాన్నిఅధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కనుక కస్టమర్లు గుర్తు తెలియని మార్గాల్లో వచ్చిన మాంసాన్ని కొనుగోలు చేయొద్దని, జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఔట్లెట్లలో మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన వధ శాలల నుంచే దుకాణాలు మాంసం తేవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఆ అధికారులు తెలిపారు. రామ్నాస్పురా, అంబర్పేట, జియాగూడ, న్యూబోయిగూడ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ వధ శాలలు ఉన్నాయి. మేకలు, గొర్రెల వధతో వచ్చే వ్యర్థాల కోసం చెంగిచెర్లలో రెండరింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్నామని జీహెచ్ఎంసీ వివరించింది.