హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురుస్తాయని, భారీ వర్షాలు వస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు. నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే వస్తున్న నేపథ్యంలో ఆమె ‘నమస్తే తెలంగాణ’కు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నైరుతి రుతు పవనాలు జూన్ 5న కర్ణాటక మధ్య భాగంలోకి ప్రవేశిస్తాయని, అక్కడ గాలి వేగాన్ని బట్టి జూన్ 8 నుంచి 10వ తేదీ లోపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని వివరించారు. అండమాన్లో నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, గాలి నైరుతి దిశలో వీస్తున్నదని తెలిపారు. లానినా, ఎల్నినో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. సముద్రంలో గాలులు ముందుగా వచ్చాయని, దీనికి వాతావరణంలో మార్పులు కూడా ఒక కారణమని తెలిపారు. దీంతో సాధారణంగా ఈ నెల 22న రావాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందుగా వచ్చాయని వివరించారు.
సాధారణంగా రుతుపవనాల ఆగమనం నాలుగు రోజులు ముందు, లేదా వెనక ఉంటుందని, దీనిని సాధారణ ప్రక్రియగానే భావించాలని స్పష్టంచేశారు. అండమాన్ సముద్రంలో బలపడిన గాలులు బంగాళాఖాతం అంతటా వ్యాపించాలని, ఇది ఆఫ్రికా కోస్ట్ వరకు బలపడాలని అన్నారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం, ఆరేబియా మహా సముద్రంలో కూడా బలపడి, 30 నాటికల్ మైల్స్ వరకు చేరితే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని వివరించారు. సోమాలియా జెట్లో కూడా గాలులు చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తే.. ఈ నెల 27 వరకు సాధారణ ప్రక్రియకు నాలుగు రోజులు ముందుగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ స్థితిని బట్టి కేరళకు మంచి వర్షాలు వస్తాయని అంచనా వేశారు.
వ్యవసాయానికి అనుకూలం
కేరళకు రుతుపవనాలు వచ్చిన తరువాత భూమి మీద వాతావరణం అనుకూలిస్తే.. తెలంగాణకు జూన్ 8 నుంచి 10 మధ్యలో నైరుతి రుతుపవనాలు వస్తాయని నాగరత్న చెప్పారు. ఇప్పటివరకు సముద్రంలో ఎలాంటి తుఫాన్లు కనిపించడం లేదని, వాతావరణం ఇలాగే సాధారణంగా ఉంటే మంచి సర్క్యులేషన్ ఫామ్ అవుతుందని, మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తే ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఈ సీజన్ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు విజృంభించాయని, అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయని గుర్తుచేశారు. ఎండలు కూడా స్థిరంగా ఉండటం వర్షాకాలానికి అనుకూలమని తెలిపారు. మే నెలలో ఒకటి రెండు సార్లు మినహాయిస్తే ఈ వేసవిలో వడగాలులు ఎక్కువ కాలం రాలేదని అన్నారు. సముద్ర గాలులపై వేడి ప్రభావం బాగా ఉన్నదని తెలిపారు.
రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు
వాతావరణం వివరాలు రైతులకు ఎప్పటికప్పుడు అందేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రతిరోజూ నివేదిక అందజేస్తున్నామని నాగరత్న తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్లు స్వచ్ఛంద సంస్థల సహకారంతో రైతులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నారని పేర్కొన్నారు. మే నెలలో వస్తున్న అడపాదడపా వర్షాలకు రైతులు దుక్కలు దున్నుకుంటే మంచిదని సూచించారు.