కొండాపూర్, సెప్టెంబర్ 29: అనుమానాస్పద స్థితిలో ఆరో తరగతి విద్యార్థిని బహుళ అంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల 35 అంతస్థుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన 10వ తరగతి విద్యార్థి రియాన్ష్రెడ్డి ఘటన మరవకముందే, శుక్రవారం 6వ తరగతి బాలిక 15వ అంతస్థు నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ పదేండ్లుగా హైదరాబాద్లో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య, కూతురు అహనా (12)తో కలిసి నల్లగండ్లలోని అపర్ణ సరోవర్లో నివాసం ఉంటున్నారు.
అహనా తెల్లపూర్లోని గ్లెండల్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నది. అదే అపార్ట్మెంట్లో మ్యాథ్స్ ట్యూషన్కు వెళ్తున్నది. కానీ, శుక్రవారం ట్యూషన్కు వెళ్లడం ఇష్టం లేదని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు మందలించి బలవంతంగా పంపించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అనుమానాస్పద స్థితిలో అదే అపార్ట్మెంట్లోని 15వ అంతస్థు కిటికీలో నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన అహనా అక్కడికక్కడే మృతి చెందింది. సందీప్ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒత్తిడి కారణంగానే బాలిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రియాన్ష్రెడి(14) ఈ నెల 25న రాయదుర్గం నాలెడ్జ్సిటీలోని మైహోం భూజ హెచ్ టవర్ 35వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మానసిక వత్తిడి వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు మానసిక వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.