దుండిగల్, నవంబర్ 24: సరైన మార్గదర్శనం ఉంటే విదేశాల్లో ఉన్నతాభ్యాసం చేయాలన్న విద్యార్థుల కల సులువుగా సాకారమవుతుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఆర్ఐఈటీ) కళాశాలలో గురువారం విదేశీవిద్య అవకాశాలపై వై యాక్సిస్ సంస్థ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ హాజరై, విద్యార్థులకు అవగాహన కల్పించారు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత చాలామంది విదేశాల్లో మాస్టర్స్ చదవాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే, వారికి సరైన గైడెన్స్ లభించక విదేశీవిద్యకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటి విద్యార్థులకు తమ వై యాక్సిస్ సంస్థ మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీల ఎంపిక, వీసా ఏర్పాటు వంటి ప్రక్రియకు కనీసం 7 నుంచి 14 నెలల కాలం పడుతుందన్నారు.
ఈ ప్రక్రియ ఆలస్యంగా మొదలుపెడితే విద్యాసంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే విద్యార్థులు వై యాక్సిస్ సంస్థను సంప్రదిస్తే సరైన సలహాలు, సూచనలు అందించి దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలోనే విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం విశ్వవిద్యాలయాలకు అధ్యాపకుల సిపార్సుల లేఖల ప్రాముఖ్యాన్ని వివరించారు. ఉపకార వేతనాలు, విద్యేతర కార్యకలాపాలపై విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ జంధ్యాల ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ జే ప్రవీణ్, కళాశాల హయ్యర్ స్టడీస్ అండ్ కాంపిటిటీవ్ ఎగ్జామ్స్ డీన్ డాక్టర్ టీ జగన్నాథస్వామి, అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ డీన్, ప్రొఫెసర్ పీ గోపాలకృష్ణ, తెలంగాణ పబ్లికేషన్స్ ఈవెంట్ మేనేజర్ టీ గణేశ్, కళాశాలకు చెందిన వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులతోపాటు పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
విదేశీ విద్యపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు మా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల కెరీర్ ప్లానింగ్, ప్రాముఖ్యతపై వై యాక్సిస్ కన్సల్టేషన్ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ మార్గదర్శనం బాగున్నది. ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విద్యార్థులకు విదేశీవిద్య కష్టమేమీ కాదు. సదస్సు ద్వారా విలువైన సలహాలు, సూచనలు అందించేందుకు కృషిచేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– డాక్టర్ జంధ్యాల ఎన్ మూర్తి, కళాశాల డైరెక్టర్, జీఆర్ఐఈటీ
సదస్సులో తెలుసుకొన్న అంశాలతో విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యాభాస్యం చేయాలనుకొనే విద్యార్థులకు ఈ సదస్సు ఎంతో విలువైన సమాచారం అందించింది. కృషి, పట్టుదలతో చదివితే విదేశాల్లో మంచి ఉద్యోగాలు పొందవచ్చు.
– డాక్టర్ జే ప్రవీణ్, ప్రిన్సిపల్, జీఆర్ఐఈటీ