హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యంగా మార్చేందుకు నడుంబిగించిన ఆర్అండ్బీ అధికారులు విస్తృతంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాలను కలిపే రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో కొట్టుకుపోయిన రోడ్ల మరమ్మతు పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. దాదాపు రూ.1,200 కోట్ల పనులు పూర్తికాగా, మరో రూ.1,300కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
వచ్చే ఏడాది జనవరి చివరినాటికి పనులన్నీ పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 2,500కోట్లు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రోడ్ల మరమ్మతులకు రూ. 1,823కోట్లు, కల్వర్టుల కోసం రూ. 544కోట్లు కలుపుకొని మొత్తం రూ. 2,367కోట్లు ఖర్చవుతుందనే అంచనాతో అధికారులు పనులు చేపట్టారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పాత ఆర్అండ్బీ సర్కిళ్ల పరిధిలో మొత్తం 6,641కిలోమీటర్లమేర రోడ్లు దెబ్బతిన్నాయి.
ఇందులో రోడ్ల మరమ్మతుల కోసం మొత్తం 1,170 పనులను మంజూరు చేయగా, వీటిలో దాదాపు 600 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 450 పనులు పురోగతిలో ఉన్నాయి. కరీంనగర్లో అత్యధికంగా 174 పనులు, వరంగల్లో 162, నల్గొండలో 138, ఖమ్మంలో 134 పనులు చేపట్టగా ఈ నాలుగు జిల్లాల్లో పనులు దాదాపు 60శాతం, సంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, రూరల్ రీజియన్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 35 శాతం వరకు పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
వర్షాల కారణంగా మరమ్మతు పనుల్లో జాప్యం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 50 శాతానికిపైగా పనులు పూర్తికాగా, మరో 450 పనుల్లో చాలావరకు తుదిదశకు చేరుకున్నట్టు తెలిపారు. ఇందులో సగానికిపైగా పనులు మరో నెల రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల 129 పనులు చేపట్టడంలో జాప్యం చోటుచేసుకున్నదని, ప్రస్తుతం ఈ పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. మొత్తం పనులన్నీ వచ్చే ఏడాది జనవరి చివరికల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు.