హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 ( నమస్తే తెలంగాణ) : పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియపై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్, పీసీసీ సేవల కింద 3,056 అపాయింట్మెంట్లను విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
ఇందులో 3014 స్లాట్లను బుక్ చేసుకున్నారని, 2936 మంది దరఖాస్తుదారులు పోస్టాఫీస్ సేవా కేంద్రాలకు రాగా, 2,641 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సంబంధిత డాక్యుమెంట్లు లేని కారణంగా కొన్నింటి ప్రక్రియ నిలిపివేసినట్టు తెలిపారు. మంజూరైన వారికి వీలైనంత త్వరగా వారి చిరునామాలకు పాస్పోర్ట్లను పంపిస్తామని తెలిపారు.