షాద్నగర్, జూలై 13: నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును షాద్నగర్ పోలీసులు ఛేదించారు. శనివారం షాద్నగర్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్, రఘురాంనగర్ కాలనీకి చెందిన కమ్మరి కృష్ణ (63) రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలు చేసేవారు. మొదటి భార్య, పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకున్నాడు.
రెండో భార్య అనారోగ్యంతో మృతి చెందగా పావని అనే మహిళను మూడో వివాహం చేసుకొని ఫారూఖ్నగర్ మండలం కమ్మదనం రెవెన్యూ పరిధిలోని కేకే ఫామ్ హౌస్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల పావని పేరుమీదు రూ.16 కోట్ల విలువచేసే 10 భవనాలు, హైదరాబాద్లోని కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్ను రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయమై తండ్రితో మొదటి భార్య కుమారుడు శివ గొడవపడ్డాడు. ఆస్తి మొత్తం మూడో భార్యకు ఇస్తాడని భావించి తండ్రిని హత్య చేసేందుకు పథకం వేశాడు.
తండ్రికి బాడీగార్డ్గా ఉన్న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కాళీమందిర్ డిఫెన్స్ ఎంప్లాయీస్ కాలనీకి చెందిన బీస్కుంద బాబాశివానంద్ని కలిశాడు. తన తండ్రిని హత్య చేస్తే రూ.25 లక్షల నగదు, ఓ ఇల్లు సుపారిగా ఇస్తానని చెప్పాడు. దీంతో బాబాశివానంద్ బండ్లగూడ జాగీర్కు చెందిన జీలకర్ర గణేశ్, అజయ్తోపాటు మరో బాలుడితో కలిసి హత్యకు పథకం వేశారు. ఈ నెల 10న కేకే ఫామ్ హౌస్లో ఉన్న కమ్మరి కృష్ణ వద్దకు చేరుకున్నారు.
బాడీగార్డ్ కమ్మరి కృష్ణ గొంతు కోయగా, మిగతా ఇద్దరు చేతులు పట్టుకున్నారు. హత్య చేసిన అనంతరం పారిపోయారు. గమనించిన పావని తన భర్తను శంషాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పావని ఫిర్యాదు మేరకు పోలీసులు కమ్మరి శివ, జీలకర్ర గణేశ్ అలియాస్ లడ్డు అజయ్, బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. వారి నుంచి రెండు కార్లు, ద్విచక్ర వాహనం, మూడు కత్తులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఆస్తిని ఇతరులకు ఇస్తున్నాడనే కోపంతోనే శివ ఈ హత్య చేయించాడని స్పష్టం చేశారు. కేసును ఛేదించిన సీఐలు విజయ్కుమార్, రామిరెడ్డి, ప్రమోద్కుమార్, పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డులను అందజేసి అభినందించారు.