హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న దస్పల్లా హోటల్లోని ఆరో అంతస్తులో నిర్వహిస్తున్న కారా కారా పబ్లో శనివారం అర్ధరాత్రి దాటాక రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మద్యం మత్తులో జరిగిన ఈ గ్యాంగ్ వార్లో పలువురు గాయపడినట్టు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ అనిల్కుమార్యాదవ్ తమ్ముడు అరవింద్యాదవ్ ఈ గొడవలో కీలకమైన వ్యక్తిగా ప్రచారం జరిగింది. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదుకు పోలీసులు మల్లగుల్లాలు పడినట్టు తెలుస్తున్నది. చివరకు ఎస్ఐ సందీప్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పాటు పబ్ యాజమాన్యంపై మరో కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించి ఇరువై మంది ఈ గొడవలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిపై చర్యలకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కారా కారా పబ్లో పార్టీలో మునిగితేలుతున్న ఎంపీ సోదరుడు అరవింద్కుమార్ యాదవ్, అనుచరులకు మరో గ్యాంగుతో గొడవ ప్రారంభమైంది. ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది. రంగంలోకి దిగిన బౌన్సర్లు రెండు గ్యాంగులను పబ్ లోపల నుంచి సెల్లార్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో కొన్ని కార్లు ధ్వంసం అయ్యాయి. పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఇరువర్గాలు అక్కడి నుంచి జారుకున్నారు. ఘటనపై ఆరా తీసి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం రేవంత్రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలో ఇంత పెద్ద ఘటన జరుగుతున్నా గంటసేపటి వరకు పోలీసులు రాకపోవడంతో నిఘావైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిందనే ప్రచారం జరిగింది.
రాష్ట్రంలో ‘హోం మంత్రి మన రేవంతన్నే’ అన్నట్టుగా అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్లోని కారా కారా పబ్లో జరిగిన ఘటనపై ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ యువ నేతలు పబ్బుల సంస్కృతిలో మునిగి తేలుతూ గొడవలకు దిగుతుంటే, పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో పోలీసులే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
నిబంధనలు ఉల్లంఘించి పబ్ ఓనర్ భయపడి ఫిర్యాదు ఇవ్వకపోయినా, సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? అని నిలదీశారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదురొంటున్న అరవింద్యాదవ్ ఆచూకీ ఎకడని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే సీసీటీవీ ఫుటేజీలను సేకరించి నిజానిజాలను బహిర్గతం చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. నిద్రమత్తులో జోగుతున్న స్థానిక అధికారులపై చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు.