హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో (Telangana decade celebrations) భాగంగా పోలీసుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సురక్షా దినోత్సవం (Suraksha dinotsavam) నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు (KBR Park) చుట్టూ ‘ఫుట్పెట్రోలింగ్ బై నైట్’ (Foot Patrolling by Night) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న సుమారు 1000 నుంచి 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కేబీఆర్ పార్కు చుట్టూ కవాతు నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కళింగ భవన్ చౌరస్తా వద్ద ఈ కవాతు ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని హోమంత్రి హోంమంత్రి మహమూద్ అలీ (Minister Mahamood Ali) ప్రారంభించనున్నారు.
కళింగ భవన్ చౌరాస్తా నుంచి ఒరిస్సా ఇజ్లాండ్, సీవీఆర్/బీవీబీ జంక్షన్, జర్నలిస్టు కాలనీ, రోడ్ నం.45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా ఒరిస్సా ఇజ్లాండ్ వరకు ఫుట్ పెట్రోలింగ్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డీజీపీ అంజనీకుమార్, సినీ నటుడు అడవిశేష్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 9 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకు పార్కు చుట్టుపక్కల ప్రధాన రోడ్లపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.