హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై డెకాయ్ అపరేషన్ చేసి డాటా చోరీకి పాల్పడ్డ మొత్తం 12 మందిని అరెస్టు చేశామని, నలుగురికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు,
ఇతర సామగ్రిని స్వాధీనం
చేసుకొన్నట్టు చెప్పారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన కుమార్ నితీశ్ భూషణ్, పూజాపాల్, సుశీల్ తోమర్, అతుల్ ప్రతాప్సింగ్, ముస్కాన్ హాస న్, సందీప్పాల్తో కలిసి ఢిల్లీ, నోయిడాలో డాటా మార్ట్ ఇన్ఫోటెక్ గ్లోబల్ డాటా ఆర్ట్స్, ఎమ్ఎస్ డిజిటల్ గ్రో పేరుతో కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, సీబీఎస్ఈ, నీట్, న్యాయవాదులు, వీఐపీలు.. ఇలా దాదాపు 140 క్యాటగిరీల్లోని 17 కోట్ల మంది డాటాను సేకరించారని, వీటిని జస్ట్ డయల్తోపాటు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా విక్రయిస్తున్నారని వివరించారు. పాన్ ఇండియా మొత్తం డాటాను నెలకు రూ.70 వేలు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాల డాటాను నెలకు రూ.50 వేలకు అమ్ముతున్నట్టు చెప్పా రు. ఈ కేసు విచారణకు అంతర్గతంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్న ట్టు చెప్పారు. జాయింట్ సీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నదని వెల్లడించారు. ఈ ముఠా అక్రమంగా సేకరించిన డాటాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లౌడ్ సర్వర్లో భద్రపర్చుకొన్నారని, వాటిని తెరిచేందుకు నిందితులను కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా జస్ట్ డయల్ సంస్థనూ ప్రశ్నిస్తామని చెప్పారు.
మహిళల డాటా ప్రత్యేకం
కుమార్ నితీశ్ భూషణ్ ముఠా దగ్గర దాదా పు 40 లక్షల మంది మహిళల వివరాలతో కూడిన డాటా ఉన్నదని సీపీ పేర్కొన్నారు. వీరి డాటాను సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్టు గుర్తించామని చెప్పారు. 1.20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు, 2 కోట్ల మంది వివిధ సంఘాల సభ్యులు, 40 లక్షల మంది నిరుద్యోగులు, కోటిన్నర మంది కార్ల యజమానుల డాటాను ఈ ముఠా భద్రపరుచుకొన్నదని తెలిపారు. ప్రతి నెలా డాటాను అప్డేట్ చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ డాటాను ముఠా పలు మార్గాల్లో సేకరిస్తుండటంతో, వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నట్టు చెప్పారు.
బ్యాంక్ డాటా విక్రయం
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ తమ వినియోగదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ బాధ్యతలను టెక్ మహీంద్ర (నోయిడా), మ్యాట్రిక్స్ సంస్థలకు ఇచ్చాయని సీపీ వెల్లడించారు. ని బంధనల ప్రకారం సంస్థ ఉద్యోగులు ఫోన్లను తీసుకెళ్లొద్దని, అయితే టెక్ మహీంద్రకు చెంది న వీరేంద్రసింగ్, మ్యాట్రిక్స్ సంస్థకు చెందిన ప్రదీప్ వాలియా తమ ఫోన్లో క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్న అప్లికేషన్లోని వివరాలను ప్రధాన నిందితుడు ఖలీఫ్ అహ్మద్కు విక్రయించినట్టు గుర్తించామని అన్నారు. ఖలీఫ్ కాల్సెంటర్ ఏర్పాటు చేసుకొ ని, మహ్మద్ జమాల్, మహ్మద్ ఆసిఫ్, చిరాగ్, అకాశ్, వికాస్ పూరీ, అతీత్ దాసును ఉద్యోగులుగా నియమించుకొన్నాడని, వారి ద్వారా సైబర్ మోసానికి పాల్పడుతున్నట్టు కనుగొన్నామని తెలిపారు.
పలు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలకు చెందిన వినియోగదారుల డాటాను తీసుకొని, ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తున్నాడని, వారినుంచి లక్షలాది రూపాయలను కొట్టేస్తున్నాడని చెప్పారు. దర్యాప్తులో భాగంగా బ్యాం క్ అధికారుల పాత్ర, ఔట్ సోర్సింగ్ తీసుకొన్న సంస్థల అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తామని వివరించారు. 2 నెలల పాటు ఢిల్లీ, యూ పీ, హర్యానా, గోవా, ఇతర రాష్ర్టాల్లో మకాం వేసి ముఠాను అరెస్టు చేసిన పోలీసులకు సీపీ రివార్డులను అందించారు. సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ కల్మేశ్వర్ శింగేవార్, సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.