చిత్తశుద్ధి, అంకితభావం, అంతకుమించి మంచి మనసుతో చేసిన ప్రతి పని అద్భుతమైన ఫలాలను అందిస్తుందని మరోసారి రుజువైంది.ఎనిమిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ గుండెకాయలాంటి హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో నగరం నేడు ప్రపంచ మేటిగా ఎదిగింది.
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్న ప్రస్తుత సమయంలోనూ తనకు ఎదురే లేదన్నట్టుగా వృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. 2023 సంవత్సరంలో ఆసియా పసిఫిక్ రీజియన్లోని మహామహా నగరాలన్నింటినీ వెనుకకు నెట్టి ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ నంబర్ వన్గా నిలుస్తుందని ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్’ తన తాజా నివేదికలో ప్రకటించింది. ఇప్పటికే ఆర్థికంగా గొప్పగా వ్యవస్థీకృతమైన షాంఘై, టోక్యో, సింగపూర్ వంటి నగరాలను కూడా హైదరాబాద్ వెనక్కు నెట్టనున్నదని తెలిపింది.
ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్లో ప్రపంచవ్యాప్తంగా 300 మంది ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఉన్నారు. ఇది స్వతంత్రంగా నడిచే గ్లోబల్ ఎకనామికల్ ఫోర్కాస్టింగ్, ఎకనామెట్రిక్ అనాలిసిస్ సంస్థ.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఈ సంవత్సరంలో ఏసియా పసిఫిక్ రీజియన్లోని మహామహా నగరాలన్నింటినీ వెనుకకు నెట్టి ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ నంబర్ వన్గా నిలుస్తుందని ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్’ తన తాజా నివేదికలో ప్రకటించింది. ఇప్పటికే ఆర్థికంగా గొప్పగా వ్యవస్థీకృతమైన షాంఘై, టోక్యో, సింగపూర్ వంటి నగరాలను కూడా హైదరాబాద్ వెనక్కు నెట్టనున్నదని తెలిపింది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్లో ప్రపంచవ్యాప్తంగా 300 మంది ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఉన్నారు. ఇది స్వతంత్రంగా నడిచే గ్లోబల్ ఎకనామికల్ ఫోర్కాస్టింగ్, ఎకనామెట్రిక్ అనాలిసిస్ సంస్థ. దక్షిణ భారతదేశంలోని బెంగళూరు నగరం కూడా 2023లో హైదరాబాద్లాగే మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని ఈ సంస్థ పేర్కొన్నది.
మాంద్యం గుప్పిట్లో ప్రపంచం
ప్రపంచం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వంటి కారణాలతో అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నాయి. 2022 చివరలో మొదలైన ఈ పరిస్థితి 2023లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్ రీజియన్లోని ప్రధాన నగరాల్లో మౌలిక వసతులు, 2022లో ఆర్థిక వృద్ధి, స్థానిక పరిస్థితులు, రాబడుతున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు, వివిధ రంగాల్లో సాధిస్తున్న వృద్ధి రేటుతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు పలు రంగాల్లో నిర్వహించిన సర్వేలను ప్రామాణికంగా తీసుకొని 2023లో నగరాల ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుందనే అంచనాలను రూపొందించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు వెన్నెముక వంటి షాంఘై, బీజింగ్ నగరాలతోపాటు ఆసియాలో అతిపెద్ద నగరాలైన టోక్యో, హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్ కూడా 2023లో ఆర్థిక మాంద్యం బారిన పడనున్నాయని తెలిపింది.
వృద్ధిలో.. తగ్గేదే లే
ఆర్థికంగా కొమ్ములు తిరిగిన నగరాలు కూడా మాంద్యం దెబ్బకు కుదేలవుతుండగా, హైదరాబాద్ మాత్రం తగ్గేదే లే అంటున్నది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఆసియా పసిఫిక్ రీజినల్ అవుట్లుక్ నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరం 2023లో 6 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదుచేయనున్నది. బెంగళూరు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేయనున్నది. చైనా నగరాలు కొవిడ్-19తో విలవిలలాడుతున్న దరిమిలా 2023లో అవి ఆర్థికంగా కోలుకొనే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. బ్యాంకాక్ నగరం పర్యాటక రంగంలో కొంతమేర కోలుకొనే అవకాశమున్నదని తెలిపింది.
పెట్టుబడుల ఆకర్షణనే ఆయువుపట్టు
హైదరాబాద్ మహా నగరం ఈ ఏడాది అనూహ్య ఆర్థిక వృద్ధి సాధించటానికి కొన్ని సంవత్సరాలుగా నిలకడగా వస్తున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే కారణంగా నిలుస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. గతంలో దేశీయ దిగ్గజ ఐటీ, ఐటీఎస్ కంపెనీలు బెంగళూరు వైపు మాత్రమే చూసేవి. గత ఎనిమిదేండ్లుగా హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. పెట్టుబడుల ఆకర్షణకు ఇక్కడ వాతావరణ అనుకూలత ఒక కారణమైతే, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వేల కోట్లు వెచ్చించి సమకూరుస్తున్న రహదారులు, ఫ్లైఓవర్లు, మంచినీరు, పార్కులు, 24 గంటల విద్యుత్తు సరఫరా తదితర మౌలిక వసతులు మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
ప్రపంచ ఐటీ దిగ్గజాలైన మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్ కంపెనీలు తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయి. వీటితోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను సైతం ఇక్కడే ప్రారంభించాయి. వచ్చే రెండుమూడేండ్లలో డాటా సెంటర్ల ఏర్పాటుకోసం సుమారు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్, అమెజాన్ ప్రకటించాయి. డాటా సెంటర్ల ఏర్పాటుకు మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ లెక్కన డాటా సెంటర్ల విభాగంలోనే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రస్తుతం అమెజాన్, మెక్రోసాప్ట్, కంట్రోల్ ఎస్ డాటా సెంటర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నది. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపుతుండగా, కొత్తగా మరిన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
ఎగుమతులు రూ.రెండు లక్షల కోట్లు
ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది దేశవ్యాప్తంగా 17.20 శాతం వృద్ధి రేటు ఉంటే, తెలంగాణలో 26.14 శాతం నమోదైంది. 2022-23లోనూ ఐటీ రంగంలో 17 నుంచి 20 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉన్నదని అంచనా. దాని ప్రకారం 2022-2023లో హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నది. ఆఫీస్ స్పేస్ వినియోగం లో బెంగళూరును హైదరాబాద్ ఎప్పుడో దాటేసింది. కొత్త ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటు కావడంతో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆఫీస్ స్పేస్లో బెంగళూరును దాటి
ఆఫీస్స్పేస్ వినియోగంలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధించిందని అన్రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ఇండియా తన నివేదికలో ఇప్పటికే స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కొత్త ఆఫీస్ స్పేస్ విభాగంలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో హైదరాబాద్ నగరంలో కొత్తగా 8.2 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ వినియోగంలోకి వచ్చింది. ఈ విభాగంలో తొలి ఏడు నగరాల్లో హైదరాబాద్ 34 శాతం వాటాతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు 26 శాతం, దేశ రాజధాని నగరం ఢిల్లీ 21 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.