Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల విజయగాథ ఒక కేస్ స్డడీగా మారిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వెలువరించే స్టాన్ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్ఎస్ఐఆర్) తాజా సంచికలో ఈ అంశాన్ని ప్రచురించిందని ఆయన తెలిపారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక భారతీయ మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) అభివర్ణించిందని తెలిపారు.
ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ అధ్యయనం సూచిస్తున్నదని పేర్కొన్నారు. ఐఎస్బీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కేస్ స్టడీగా ఎంచుకొన్నదని పేర్కొన్నారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగర విస్తరణలో మెట్రో రైలు కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.