హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక సోషల్ సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. సీఈవో క్లబ్స్ ఆఫ్ ఇండియా దీనిని ప్రకటించింది. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన ‘గో బియాండ్ 2023’ రీట్రీట్ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆరోగ్యస్వామి వేలుమణి చేతులమీదుగా ఎన్వీఎస్ రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును వినూత్న రీతిలో చేపట్టి హైదరాబాద్లో మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని ఎన్వీఎస్ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. సీఈవో క్లబ్స్ ఆఫ్ ఇండియా వివిధ రంగాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించింది.