హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ముఖ్యంగా తెలంగాణ తూర్పు, ఉత్తర జిల్లాలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతాయని, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి అటవీ ప్రాంతం ఉన్న జిల్లాల్లో ఎండవేడిమి ఉంటుందని హెచ్చరించింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరిందని, హకీంపేట్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, భద్రాచలం జిల్లాల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించింది. వచ్చే 24 గంటలో వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల వరకు నమోదవుతాయని వెల్లడించారు. ఎండల ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
