హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ కార్ రేసింగ్కు ప్రసిద్ధి చెందిన ఎఫ్ఐఏ ఫార్ములా-ఈని హైదరాబాద్కు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫార్ములా-ఈ హైదరాబాద్కు వస్తున్నదని మంత్రి ట్వీట్ చేశారు. ‘ఈ గ్రహం మీద వేగంగా అభివృద్ధి చెందుతున్న మోటార్ స్పోర్ట్ సిరీస్ ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ హైదరాబాద్కు వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎలక్ట్రిక్ గ్రోత్ను, కర్బన రహిత సుస్థిరమైన ఫ్యూచర్ను అందిస్తుంది. తెలంగాణను ఆదర్శవంతమైన ఈవీ హబ్గా మారుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై టెక్మహీంద్ర సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ స్పందించారు. ‘కేటీఆర్.. మీరు ఎప్పుడూ ఒక ట్రయల్ బ్లేజర్ (పథ నిర్దేశకులు). మీ సాహసోపేతమైన చర్యను చూసి నేను ఆశ్చర్యపోలేదు. భారతదేశానికి రేసింగ్ స్ఫూర్తిని అందించిన ఎఫ్ఐఏ ఫార్ములా-ఈకి ధన్యవాదాలు. సొంతగడ్డపై మహీంద్ర రేసింగ్కు చీర్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. గ్రీన్బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హెమ్ కూడా స్పందించారు. ‘అద్భుతమైన హైదరాబాద్. గ్రహం మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మోటార్ స్పోర్ట్ సిరీస్ ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ భారత్కు వస్తున్నది. కేటీఆర్.. మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు, తెలంగాణలో గ్రీన్ పురోగతిని చాటిచెప్పేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం’ ట్వీట్లో పేర్కొన్నారు.