కొండాపూర్, అక్టోబర్ 17 : కడవరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసి భార్యను.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను బలవన్మరణం చెందాడు. ఈ దారుణం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో, స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన మడపతి నాగరాజు (42), భార్య సుజాత (35) దంపతులు. సిద్ధు (10), రమ్య (8) వీరి సంతానం. ఏడేండ్లుగా శేరిలింగంపల్లి రాజీవ్ గృహకల్పలోని బీ -69, 11 ఫ్లాట్లో నివాసముంటున్నారు. నాగరాజు అమ్మా బ్రాండ్కు చెందిన మిల్లెట్స్, రాగి పిండి, చిరుధాన్యాలను దుకాణాలకు సరఫరా చేయగా, సుజాత ఇంట్లోనే కుట్టు పనులు చేసింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజులుగా నాగరాజు పనులకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.
భోజనంలో విషం కలిపి.. కత్తెరతో పొడిచి..
భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో నాగరాజు తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను సైతం అమానుషంగా కడతేర్చాడు. శుక్రవారం రాత్రి భోజనంలో విషం కలిపి పెట్టాడు. విష ఆహారం తిన్న తర్వాత కూడా భార్యా, ఇద్దరు పిల్లలు బతికే ఉన్నారన్న అనుమానంతో ముగ్గురిని ఇంట్లో ఉన్న కత్తెరతో దారుణంగా పొడిచి చంపాడు. ఆపై తాను కూడా ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ తెలిపారు. సమాచారం ఇవ్వడంతో మృతురాలి తండ్రి అంజయ్య, కుటుంబ సభ్యులు వచ్చారని చెప్పారు. ఈ ఘటనపై అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.