హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగంలో హైదరాబాద్, వరంగల్ నగరాలు దూసుకెళ్తున్నాయి. నగరాల క్యాటగిరీలో భాగ్యనగరం టాప్లో, జిల్లాల విభాగంలో వరంగల్ జోరు చూపుతున్నది. ఇండ్ల నిర్మాణాలకు పాదర్శకంగా, అవినీతిరహితంగా సులువుగా అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్బీపాస్ తీసుకొచ్చింది. దీనిద్వారా ఇప్పటివరకు 1,38,411 నిర్మాణాలకు దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో టీఎస్బీపాస్ను అమలు చేస్తున్నారు. గృహ నిర్మాణాలకే కాకుండా వాణిజ్య నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారు.
ఇంటి నుంచే ఆన్లైన్లో పత్రాలను టీఎస్బీపాస్కు అప్లోడ్ చేస్తే, నిర్దేశిత సమయంలోపు ఆయా ధ్రువీకరణలు జారీ అవుతాయి. అనుమతుల జాప్యంలో అవసరమైన క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలో జాప్యం జరిగితే బాధ్యులైన అధికారుల వేతనాలను కట్ చేశారు. తద్వారా టీఎస్బీపాస్ ఎంత సీరియస్గా ఉందో ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. టీఎస్బీపాస్ ప్రారంభించిన 2020 నుంచి ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30,087 ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత హైదరాబాద్ నగర ప్రతిష్ట పెరగడం, అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ కంపెనీల విస్తరణ తదితర కారణాలతో నిర్మాణ రంగం నంబర్వన్గా ఎదిగింది. హైదరాబాద్ తరువాత గ్రేటర్ వరంగల్ ముందు నిలిచింది. ఇక్కడ 7,329 ఇండ్లకు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్బీపాస్ విధానంలో ఇంకా దరఖాస్తు విధానంపై అవగాహన కోసం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వీడియోలు, ఇతర మార్గాల్లో ప్రచారం చేస్తున్నారు.