చిన్న చిత్రంగా తెరకెక్కి ఈ ఏడాది ప్రారంభంలో ఆహా ఓటీటీలో విడుదలైన చిత్రం ‘మెయిల్’(చాపర్ట్1- కంబాలపల్లి కథలు). ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. జూన్లో నిర్వహించబోయే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఎఫ్ఎఫ్)2021కు ఈ చిత్రం ఎంపికైంది. తమ సినిమా ఈ ప్రదర్శనకు ఎంపిక కావడంపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది.
డిజిటల్ యుగం ప్రారంభమవుతున్న సమయంలో పల్లెటూరిలో ఉండే అమాయకత్వం, హాస్యం, భావోద్వేగాల కలయికను ‘మెయిల్’ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇది జనాలకు బాగా కనెక్ట్ అయింది. స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.