హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): మిద్దెతోటల పెంపకం ప్రశంసనీయమని, హైదరాబాద్లో 35 వేల మిద్దెతోటలు ఉండటం గర్వకారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. పబ్లిక్ గార్డెన్లో ఉద్యానశాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్, అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సేంద్రియ కూరగాయల పెంపకంపై ప్రజలకు ఆలోచన పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని రకాల ఉత్పత్తులకు అనుకూలమని, ఇకడి వ్యవసాయం పరిపుష్టం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నదని సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు.
తొమ్మిదేండ్ల్లలో సాగునీరు, కరంటు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్ల కోసం రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, దేశంలో ఇంతమొత్తం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. మనకన్నా ఐదు రెట్లు పెద్దదయిన యూపీలో కూడా ఇందులో 10 శాతం ఖర్చుపెట్టలేదని అన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతులమీదుగా 228 మందికి అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.