Pravalika | చిక్కడపల్లి, అక్టోబర్ 14: ప్రేమ విఫలమవటంతోనే మర్రి ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని హైదరాబాద్ సెంట్రల్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ప్రవళిక ఇప్పటివరకు ఎలాంటి పోటీ పరీక్ష రాయలేదని, కోచింగ్ కోసం 15 రోజుల క్రితమే హైదరాబాద్లోని అశోక్నగర్కు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి మీడియాతో కేసు వివరాలను తెలియజేశారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) స్థానికంగా ఉన్న గీతాంజలి కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిందని, గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం 15 రోజుల క్రితమే అశోక్నగర్కు వచ్చి, ఓ గర్ల్స్ హాస్టల్లో చేరినట్టు డీసీపీ వివరించారు. హాస్టల్లో ప్రవళిక తన రూమ్మేట్స్, ఇతరులతో పెద్దగా మాట్లాడేది కాదని, ఎప్పుడూ మూడీగా ఉండేదని ఆమె రూమ్మేట్స్ శ్రుతి, సంధ్య చెప్పినట్టు తెలిపారు.
శుక్రవారం రాత్రి శ్రుతి, సంధ్య తినేందుకు బయటికి వెళ్లగానే ప్రవళిక గది తలుపులు వేసుకున్నదని, భోజనం తర్వాత వారిద్దరు వచ్చి తలుపు తట్టగా ఎంతకీ తెరవలేదని వెల్లడించారు. దీంతో విషయాన్ని హాస్టల్ సిబ్బంది, ఇతర విద్యార్థులకు చెప్పి తలుపులు పగులగొట్టి చూసేసరికి ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని కనిపించిందని వివరించారు.
రాత్రి 8.40 గంటల సమయంలో తమకు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, గదిని పరిశీలించగా సూసైడ్ నోట్, లవ్లెటర్ లభించిందని, ఆ లెటర్ ప్రవళిక రాసినట్టుగానే ఉన్నదని తెలిపారు. ఆమె రాసిన సూసైడ్ నోట్లో పోటీ పరీక్షల విషయాన్ని ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా సూసైడ్నోట్, లవ్లెటర్, సెల్ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని వివరించారు.
ఫోన్ చాట్ ఆధారంగా..
ప్రవళిక మొబైల్ను పరిశీలించగా.. ఆమె చేసిన చాటింగ్, ఆమె గదిలో లభించిన లవ్ లెటర్ ఆధారంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలానికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రవళిక ప్రేమలో ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని డీసీపీ తెలిపారు. ప్రవళికను కాదని మరో యువతితో అతడు నిశ్చితార్థం చేసుకున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. ఆ నేపథ్యంలోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్యహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రవళిక, శివరామ్ శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అశోక్నగర్లోని బాలాజీదర్శన్లో టిఫిన్ చేసిన సీసీ ఫుటేజీ సైతం సేకరించినట్టు పేర్కొన్నారు.
ప్రేమ విషయం తల్లిదండ్రులకూ తెలుసు
ప్రేమ వ్యవహారం ప్రవళిక తల్లిదండ్రులు లిం గయ్య, విజయకు కూడా తెలుసని, గతంలో ఈ విషయమై ప్రవళిక, శివరామ్ను ఆమె తల్లిదండ్రులు హెచ్చరించినట్టు డీసీపీ తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక తదుపరి విచారణ జరిపి ప్రియుడు శివరామ్పై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం శివరామ్ పరారీలో ఉన్నాడని, వీలైనంత త్వరగా అదుపులో తీసుకుంటామని స్పష్టంచేశారు.
అభ్యర్థులను రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు
గ్రూప్-2 వాయిదా పడటానికి, ప్రవళిక ఆత్మహత్యకు సంబంధమే లేదని డీసీపీ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి ఆత్యహత్య విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకొని అసత్య ప్రసంగాలు చేశారని తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, వదంతులు పుట్టించి అభ్యర్థులను రెచ్చగొట్టి, నిరసనలకు దిగారని వెల్లడించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగిందని వివరించారు. రాత్రి 1 గంటల ప్రాంతంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, ఈ దాడుల్లో సైఫాబాద్ పీఎస్ ఏసీపీ కేవీఆర్ సత్యనారాయణ, ఎస్సై తరుణ్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఘటనకు బాధ్యులైన విద్యార్థులు, రాజకీయ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రవికుమార్, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి పాల్గొన్నారు.
బందోబస్తు నడుమ ప్రవళిక అంత్యక్రియలు పూర్తి
దుగ్గొండి, అక్టోబర్ 14: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (22) అంత్యక్రియలు శనివారం పోలీసు బందోబస్తు నడుమ పూర్తయ్యాయి. ప్రేమించిన యువకుడు మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో మనస్తాపం చెందిన ప్రవళిక.. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో తాను ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో ఉరేసుకున్నది.
ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని ఆమె స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా.. ఆమె మృతిపై ప్రతిపక్షాలు, ఓయూ, కేయూ జేఏసీ నాయకులు రాద్ధాంతం చేసి అంతిమయాత్రకు ఆటంకం కలిగించారు. పోలీసులు భారీగా చేరుకొని వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆమె మృతితో బిక్కాజిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చి ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.