హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అమ్మాయి సంతోషి సుష్మాబుద్ధిరాజు..భిన్నమైన కెరీర్ను ఎంచుకున్నది. మహిళలు అరుదుగా ఎంచుకునే యంత్ర పరికరాల ఉత్పత్తిలోకి అడుగుపెట్టింది. ఎన్నో సవాళ్లను అధిగమించి గ్యాస్ నిక్షేపాల వెలికితీత, కేబుళ్లు వేయటం, సొరంగాలు తవ్వటం వంటి పనిని సులభతరం చేసే ట్రెంచర్ మిషన్కు రూపకల్పన చేసింది. ఈమె తన స్టార్టప్ను అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అలీప్ వీ హబ్లో ఇంక్యుబేట్ చేసింది. సాహసోపేతమైన ఆమె కృషి ఫలించింది. ఆమె తయారు చేసిన స్టార్టప్కు అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ల నుంచి గుర్తింపు లభించింది.
రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన చాలెంజ్లో దేశవ్యాప్తంగా 200లకు పైగా స్టార్టప్లు పోటీ పడగా సంతోషి తయారు చేసిన ట్రెంచర్ స్టార్టప్ విజేతగా నిలిచింది. దీంతో స్టార్టప్ డెవలప్మెంట్ కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ వన్ మిలియన్ డాలర్ను ప్రోత్సాహకంగా ప్రకటించాయి. సంతోషి ఐఐటీ వారణాసిలో మెటలర్జికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. విదేశాల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె ఇండియాలోనే తన సేవలు అందించాలని నిర్ణయించుకుని 2020లో ‘ఆటోక్రసీ మెషినరీ’ సంస్థను స్థాపించింది. పలు పరిశోధనలు జరిపి వివిధ రకాల ట్రెంచర్ మిషన్లను తయారు చేసింది.