సుల్తాన్బజార్, మే 7: మహిళలు, చిన్నారుల సంరక్షణే ప్రధాన బాధ్యతగా భరోసా కేంద్రం ఏర్పడిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్ ఆరో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ ఆనంద్ మాట్లాడుతూ మహిళలకు, చిన్నారులకు కష్టాలు వచ్చిన సమయంలో తామున్నామంటూ ‘భరోసా’ కల్పించడం అభినందనీయమన్నారు. బాధితులకు సహాయం అందించడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాలనేరస్తులకు పునరావాసం, మానసికంగా ఇబ్బందులు పడిన బాలలకు సహాయం చేయడం, కౌన్సెలింగ్ సెషన్లకు హాజరయ్యే మహిళలకు ఆశ్రయం, నిరాదారణకు గురైన వృద్ధులకు తాత్కాలికంగా ఆసరా కల్పించడం, గృహ హింసకు గురైన వారికి న్యాయ సహాయ సహకారాలు అందించడం వంటి బాధ్యతలను వివిధ శాఖలు, హెచ్సీఎస్సీ సహకారంతో భరోసా కేంద్రం నిర్వహిస్తున్నదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రతి జిల్లాలో వీటిని ఏర్పాటు చేసే విధంగా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ పోలీసులతో పాటు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అండగా ఉండి బాధిత మహిళలకు సహాయం అందించడంలో మరింత కృషి చేస్తారన్నారు.
ఈ సందర్భంగా సీపీ ఆనంద్ భరోసా కేంద్రం సిబ్బంది, హెచ్సీఎస్సీ ప్రతినిధులకు రివార్డులను అందించారు. అంతకుముందు హెచ్సీఎస్సీ తరపున ఎన్సీసీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ అల్లురి నారాయణరాజు సౌజన్యంతో భరోసా కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో వాహనాన్ని సీపీ ఆనంద్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్లు కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో క్రైమ్స్ అండ్ సిట్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీడీ జాయింట్ సీపీ గజరావు భూపాల్, అడిషనల్ డీసీపీ శిరీష రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.