హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనువుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పంపే ‘క్యాష్బ్యాక్ ఆఫర్’లలో పడిపోవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ఫోన్ నంబర్లు, ఇంటర్నెట్ మేసేజింగ్ అప్లికేషన్స్ నుండి చాలా మంది తమ పేటీఎం, గూగుల్ పే లేదా ఫోన్ పే యాప్లలో క్యాష్బ్యాక్ను భరోసా ఇచ్చే సందేశాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
మీరు రూ .1971, రూ .1857, రూ .1947 ను గెలిచారు వంటి ముఖ్యమైన తేదీలతో కూడిన సందేశాల లింక్ను సైబర్ నేరగాళ్లు పంపుతున్నట్లు చెప్పారు. ప్రజలు లింక్పై క్లిక్ చేస్తే డబ్బు కోల్పోయే అవకాశం ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ జి. మల్లేష్ తెలిపారు.
పండుగ సీజన్లలో ఇది ఒక సాధారణ రకం మోసంగా తయారైనట్లు చెప్పారు. అలాంటి సందేశాల గురించి కొంతమంది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారన్నారు. దీంతో పోలీసులు పౌరులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వారి ఇ-వాలెట్ ప్లాట్ఫారమ్లలో లేదా వాట్సప్ లేదా మేసేజ్ ద్వారా అందే లింక్ల్లో అనుమానాస్పద సందేశాలను క్లిక్ చేయొద్దని కోరారు.