హైదరాబాద్ సిటీబ్యూరో / చార్మినార్ / సైదాబాద్ / మెహిదీపట్నం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రశాంతత నెలకొన్నది. శుక్రవారం పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతల సమస్యను సృష్టించాయి. దీంతో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల మనోభవాలను దెబ్బతీస్తూ, కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మూడు రోజులు వరుసగా రాత్రి, పగలు యువకులు పాతబస్తీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పచ్చటి హైదరాబాద్లో మత చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు రాజాసింగ్పై పీడీయాక్టు ప్రయోగించి, జైలుకు పంపించారు.
మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాతబస్తీలో ఆందోళనలు పూర్తిగా సద్దుమణిగాయి. ఎవరూ కూడా నిరసన ప్రదర్శనలు చేయవద్దని, స్థానిక మసీదుల్లోనే శుక్రవారం ప్రార్థనలు చేసుకోవాలని రాజకీయ నాయకులు, మత పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు యువకులు చాలా మంది స్థానిక మసీదుల్లోనే ప్రార్థనలు చేశారు. తమ వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని కోరామని, పోలీసులు వేగంగా స్పందించి పీడీయాక్టు ప్రయోగించారని, పోలీసుల చర్యలపై పలువురు హర్షం వ్యక్తంచేశారు. మక్కా మసీదు, సైదాబాద్, మెహిదీపట్నం, కార్వాన్ తదితర ప్రాంతాల్లో ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. కొంతమంది యువత మక్కా మసీదు వద్ద నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు, మత పెద్దలు వారిని సముదాయించి పంపించారు.
ఇటీవలి ఘటనలతో కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరో పక్క పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లుచేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తోపాటు ప్రత్యేక బలగాలను మోహరించారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్క ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ చౌహాన్, జాయింట్ సీపీలు రంగనాథ్, కార్తికేయ, సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య చార్మినార్ పరిసరాల్లో ఉంటూ పరిస్థితిని సమీక్షించారు.
మూడు, నాలుగు రోజులుగా జరగుతున్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. శాంతిభద్రతల సమస్య సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రశాంతతకు భంగం కలగకుండా పోలీసులపై నమ్మకం ఉంచి మాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించేవారిపై కఠినంగా ఉంటాం. – సీపీ సీవీ ఆనంద్