హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): వీసా ముగిసినా దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్రికన్లను పోలీసులు పట్టుకొన్నారు. వీరిలో కొందరు డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. కొందరు విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నట్టు తెలుసుకొన్న హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో ఏడుగురి వీసా గడువు ముగిసినట్టు తేలింది. ఇద్దరు డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలుసుకొని అరెస్టు చేశారు. బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆ వివరాలను మీడియాతో వెల్లడించారు.
పోలీసుల సోదాల్లో ఉగ్వు అంటోని సండే (నైజీరియా), కొనె మౌస్సా(ఐవరీకోస్ట్), అస్సెయూ విలియమ్ డికాైస్టెర్ (ఐవరీకోస్ట్), ఓబోయిరా పీటర్ చుక్వుమేకా (నైజీరియా), ఉమెయిజిరా కింగ్స్లే (నైజీరియా), హెన్రి చిగ్బో ఉమెబ్యూనీ (నైజీరియా),అమోబీచుడ్వు (నైజీరియా) అక్రమంగా నివాసం ఉంటున్నట్టు తేలిందని చెప్పారు. వీరిలో హెన్రి చిగ్బో ఉమెబ్యూనీ, అమోబీచుడ్వు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే మెటాఫెటామైన్, కొకైన్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామని వెల్లడించారు. మిగతా ఐదుగురిని వారి స్వదేశానికి పంపేందుకు(డీపోట్) చర్యలు తీసుకొన్నామని వివరించారు. వీరిలో ఒకరికి వేరే రాష్ట్రంలో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నదని తెలిపారు.సమావేశంలో డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో 2,900 మంది ఆఫ్రికన్లు నివాసం ఉంటున్నారని, దాదాపు 750 మంది వీసా, పాసుపోర్టు గడువు ముగిసినా అక్రమంగా తిష్ఠ వేశారని డ్రైవ్లో వెలుగులోకి వచ్చింది. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.