హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ప్రపంచాన్ని అనేక రకాల వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో చాలా మంది ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే యాంటి బయోటిక్స్ వినియోగిస్తున్నారు. అధిక మోతాదులో వీటిని వినియోగించడంతో శరీరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరుగుతున్నది. దీని కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది చనిపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న ఏఎంఆర్కు ఏజెంటింక్-ఏఐ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది.
హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ ‘ఎస్సీఐఐఎన్వీ బయో సైన్సెస్’ దేశంలోనే తొలిసారి ఏఐని వినియోగించి ఔషధ పునర్వినియోగ పద్ధతులతో కొత్త యాంటీ బయోటిక్ మందును రూపొందిస్తున్నది. ఇప్పటికే ఈ ఔషధాన్ని ల్యాబొరేటరీల్లో బ్యాక్టీరియాపై, ఆ తర్వాత జంతువులపై ప్రయోగించడంతో సత్ఫలితాలు వచ్చినట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మందు హ్యూమన్ ట్రయల్స్కు భారీగా ఖర్చు కానుండటంతో ఎస్సీఐఐఎన్వీ బయో సైన్సెస్ బయో ఆసియా సదస్సులో ‘వేల్ట్యాంక్ బయో క్యాటలిస్ట్’ అనే సంస్థతో కీలక ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ముగిసి, పేటెంట్స్ వచ్చాక ఈ మందును మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేల మందుల పనితీరును అధ్యయనం చేసిన తర్వాత కొత్త ఏఐ బేస్డ్ యాంటీ బయోటిక్ ఔషధాన్ని రూపొందించినట్టు ఎస్సీఐఐఎన్వీ బయో సైన్సెస్ ప్రతినిధులు తెలిపారు. మాలిక్యులర్ డాకింగ్ (ఒక చిన్న అణువు, ఒక పెద్ద ప్రోటీన్ ఒకదానితో ఒకటి ఎలా బంధించబడతాయో అంచనా వేసే కంప్యూటర్ ఆధారిత సాంకేతికత)పై విస్తృత స్థాయిలో అధ్యయనాలు జరిపి ఈ ఔషధాన్ని రూపొందించామని, ఏఎంఆర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని వివరించారు. ఏఎంఆర్కు మందును కనుగొనేందుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు బిలయన్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ అవి క్లినికల్ ట్రయల్ దశకు చేరుకోలేదని చెప్పారు.
హానికరమైన బాక్టీరియా, వైరస్లు, ఫంగస్ ఇతర పరాన్నజీవులు యాంటీ బయాటిక్స్కు లొంగకుండా నిరోధక శక్తిని పెంపొందించుకోవడాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఇది పెరిగితే ఇన్ఫెక్షన్లకు చికిత్స కష్టతరంగా మారడంతోపాటు ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది.
ఔషధ తయారీ కంటే వేగంగా ఏఎంఆర్ ఆందోళన కర స్థాయికి చేరింది. ఏఎంఆర్కు అడ్డుకట్ట వేసేందుకు విస్తృత ఆవిష్కరణలు, పరిశోధనలు అవసరమని నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్ఏపీ), గ్లోబల్ యాక్షన్ ప్లాన్ (జీఏపీ) స్పష్టం చేస్తున్నాయి. ఎంతో వ్యయప్రయాసలతో కూడిన నూతన ఔషధ ఆవిష్కరణలకు అత్యున్నత మేధస్సు ఉన్న శాస్త్రవేత్తలు కావాలి. మన దేశంలోని పెద్ద కంపెనీలు ఖర్చు, రాబడి గురించి ఆలోచిస్తూ ఇలాంటి ఆవిష్కరణల జోలికి పోవడం లేదు. ఎస్సీఐఐఎన్వీ బయో సైన్సెస్ రూపొందిస్తున్న ఏఐ బేస్డ్ మెడిసిన్తో ఏఎంఆర్కు చెక్ పెట్టే అవకాశం ఉన్నది. ఇది అందుబాటులోకి వస్తే చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఫలితాలను వేగంగా విశ్లేషించవచ్చు. శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు కలిసి పనిచేస్తే ఇలాంటి ఔషధాలు పేషెంట్లకు చేరే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ రంగారెడ్డి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు