హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్, గార్బేజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్సీ) స్టార్ రేటింగ్స్లో జీహెచ్ఎంసీకి క్లీన్ సిటీ అవార్డు దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో భాగంగా లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల క్యాటగిరీలో జీహెచ్ఎంసీకి జాతీయస్థాయిలో 9వ ర్యాంకు, 5 స్టార్ రేటింగ్ సర్టిఫికెట్ లభించాయి. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్పురి ముఖ్యఅతిథులుగా పాల్గొని పురస్కారాలను అందజేశారు.
అలాగే, లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న జోనల్ అవార్డు క్యాటగిరీలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి సౌత్జోన్ క్లీనెస్ట్ సిటీ అవార్డు, 25,000-50,000 మధ్య జనాభా ఉన్న క్యాటగిరీలో నిజాంపేటకు సౌత్జోన్ క్లీనెస్ట్ సిటీ అవార్డు, 50,000-1,00,000 మధ్య జనాభా ఉన్న పట్టణాల్లో సిద్దిపేటకు సౌత్జోన్ క్లీనెస్ట్ సిటీ అవార్డు దక్కాయి. జోనల్ లెవల్ క్యాటగిరీలో 18 మున్సిపాలిటీలకు అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయి. ర్యాంకులు సాధించినవాటిలో నిజాంపేట, మేడ్చల్, పిర్జాదిగూడ, నార్సింగి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, దుబ్బాక, నాగారం, ఎల్లందు, తుర్కయంజాల్, బొల్లారం, హుజూరాబాద్, ఆర్మూర్, అమీన్పూర్, బోడుప్పల్, బండ్లగూడ జాగీర్ తదితర మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తోపాటు వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొని అవార్డులను అందుకున్నారు.