హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. ఆ పిల్ను స్వీకరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు సమన్లు ఇచ్చింది. పవన్తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తేల్చిచెప్పింది. కల్తీ నెయ్యితో తయారుచేసిన లడ్డూలను అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా టీటీడీ పంపించినట్టు పవన్ చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పిల్ను విచారణకు అంగీకరించిన సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక విచారణ జరిపి పవన్కల్యాణ్, సీఎస్ శాంతికుమారిలకు సమన్లు పంపించింది. లడ్డూ వివాదంపై పవన్ చేసిన వ్యాఖ్యలను సోషల్మీడియా, వెబ్సైట్లు, యూట్యూబ్ చానెళ్లు సహా పలు అన్ని ప్లాట్ఫాం నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టుకువిజ్ఞప్తి చేశారు.